అరుణ్ సాగర్ కన్నుమూత: ఆయన మేల్ కొలుపు తనకెంతో ఇష్టమన్న బాలకృష్ణ
హైదరాబాద్: ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు అరుణ్ సాగర్ కన్ను మూశారు. ఆయన వయస్సు 49 ఏళ్లు. అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందతూ ఆయన మరణించారు. ఆయన మాగ్జిమమ్ రిస్క్, మేల్కొలుపు, మ్యూజిక్ డైస్ కవితా సంకలనాలను వెలువరించారు. తెలుగు కవిత్వంలో ఆయన తన ప్రత్యేకమైన ముద్రను వేశారు.
తొలుత పత్రికా రంగంలో పనిచేసిన ఆయన అ తర్వాత ఎలక్ట్రానికి మీడియాకు మారారు. పలు టీవీ చానెళ్లలో ఆయన ఉన్నతమైన పదవుల్లో పనిచేశారు. అరుణ్ సాగర్ మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతాపం ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరుణ్ సాగర్ మృతికి సంతాపం ప్రకటించారు.
అరుణ్ సాగర్ మరణం చాలా బాధాకరం, తీరని లోటని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, తెలుగు సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ మధ్యనే ఆయన్ను కలిశానని, టీవీ ఛానెల్ ఎడిటర్ గా ఆయన అందించిన సేవలు మరువలేనివని బాలకృష్ణ అన్నారు.
అలాగే మంచి రచయిత కూడా అని చెప్పారు. మాగ్జిమమ్ రిస్క్, మేల్ కొలుపు ఇలాంటి బుక్స్ ను రచించారని, ఆయన రచించిన మేలుకొలుపు తనకు బాగా ఇష్టమని చెప్పారు. ఆనారోగ్యంతో అరుణ్ సాగర్ ఉన్నట్టుండి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం బాధను కలిగిస్తోందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు.
సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ కవి అరుణ్ సాగర్ మృతికి తెలంగాణ ఆన్ లైన్ జర్నలిస్టు యూనియన్ (తోజు) సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేసింది. అరుణ్ సాగర్ మృతి జర్నలిజానికి మాత్రమే కాకుండా తెలుగు సాహిత్యానికి తీరని లోటు అని సంఘం అధ్యక్షకార్యదర్శులు కాసుల ప్రతాపరెడ్డి, ధర్మాసనం శ్రీధర్ శుక్రవారం ఓ ప్రకటనలో అన్నారు.
ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో పనిచేసిన అరుణ్ సాగర్ జర్నలిజంలో తనదైన ముద్రను వేశారు. టీవీ చానెళ్లను నడిపించాలంటే అరుణ్ సాగర్ వంటి జర్నలిస్టు ఉండాలని అనిపించుకున్న ప్రతిభ ఆయనదని వారన్నారు. తెలుగు కవిత్వంలోనూ ఆయన తనదైన ప్రత్యేకమైన ముద్రను వేశారని చెప్పారు. మాగ్జిమమ్, మేల్ కోలుపు, మ్యూజిక్ కవితా సంపుటుల ద్వారా తెలుగు కవిత్వంలో తనకు సాటి ఎవరూ రారని, తనది ప్రత్యేకమైన ఆలోచనా ధోరణి, శైలి అని నిరూపించుకున్నారని చెప్పారు.
పోలవరం ముంపు గ్రామాల ప్రజల ఆర్తిని, ఆవేదనను ఓ నిర్వాసితుడిగా అరుణ్ సాగర్ మ్యూజిక్ డైస్ కవితా సంపుటిలో వ్యక్తీకరించారని, పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులవుతున్న గిరిజనుల ఆవేదనను,గూడు కోల్పోయి, అస్తిత్వాన్ని కూడా కోల్పోతున్న వైనాన్ని ఆయన ఆ కవిత్వంలో వినిపించారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగలాని వారు కోరారు.