రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం
మహబూబ్నగర్: మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డి పల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు.
కేరళకు చెందిన ఇన్నోవా, మహారాష్ట్రకు చెందిన టవేరా వాహనం ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నాయి. వేగంగా వస్తూ ఢీకొనడంతో వాహనాలు నుజ్జు అయ్యాయి. ప్రమాదంలో కేరళకు చెందిన ఒక మహిళ, మహారాష్ట్రకు చందిన ఆరుగురు అక్కడికక్కడే మరణించారు
ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై ఇరువైపులా పెద్ద యెత్తున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని కార్లలో ఇరుక్కున్న మృతదేహాలను వెలికి తీశారు. మహారాష్ట్రకు చెందినవారు తిరుపతి నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాగా, మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్ చౌరస్తాలో కారు బోల్తా పడి ఒకరు చనిపోగా ఇద్దరు గాయపడంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుంటే, మహబూబ్నగర్ జిల్లా కోస్గీ మండలం నాచారం దగ్గర ఓ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.