వైఫ్ బర్త్ డే ఉందని అప్పట్లో తప్పించుకున్నా!.. ఇప్పుడా ఛాన్స్ లేదు: కేటీఆర్(ఫోటోలు)
హైదరాబాద్: ప్రజారోగ్యంపై అవగాహన కల్పించడంలో భాగంగా ఎయిర్టెల్ సంస్థ ఓ మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్ వేదికగా గతంలో ఆరుసార్లు ఈ మారథాన్ నిర్వహించగా.. ఏడో ఎడిషన్ కోసం ఆ సంస్థ సిద్దమవుతోంది. ఆగస్టు 20న జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి రన్ లోగో, టీషర్ట్, ఫినిషర్ మెడల్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు.
బంజారాహిల్స్లోని తాజ్కృష్ణా హోటల్లో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ నిర్వహిస్తున్న ఈ మారథాన్ విజయవంతం కావడం కోసం ప్రభుత్వ అధికారులంతా శ్రమిస్తున్నారని అన్నారు.
వైఫ్ బర్త్డే అని తప్పించుకున్నా!:
గతంలో 2014లో నిర్వహించిన మారథాన్ లో తాను తొలిసారిగా పాల్గొన్నానని కేటీఆర్ గుర్తుచేశారు. ఎలాంటి ప్రాక్టీస్ లేకపోయినా.. 5కి.మీ సునాయాసంగా పరిగెత్తగలనని భావించినట్లు తెలిపారు. అయితే సగం దూరం వెళ్లేసరికే తన పని అయిపోయిందని సరదా వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు, ఇంతకుముందు నిర్వహించిన మారథాన్ లు అన్ని అగస్టు చివరి వారంలో ఉండేవని, ఆ సమయంలో తన భార్య బర్త్ డే ఉండటంతో.. ఆ పేరు చెప్పి తప్పించుకునేవాడినని కేటీఆర్ గుర్తుచేశారు. అయితే ఈసారి ముందుగానే మారథాన్ నిర్వహిస్తుండటతో తాను దొరికపోక తప్పలేదని అన్నారు. కేటీఆర్ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు కార్యక్రమంలో నవ్వులు పూయించాయి.
నగరవాసులంతా రండి:
అగస్టు 20న జరిగే ఈ మారథాన్ లో తాను తప్పకుండా పాల్గొంటానని, నగరవాసులంతా ఇందులో పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ విభాగాలన్నీ ఈ రన్ విజయవంతం కావడానికి తమ వంతు కృషి చేస్తున్నాయన్నారు.
మారథాన్ రేస్ డైరెక్టర్ ఏమన్నారంటే:
రన్నింగ్ చేయడాన్ని ఆరోగ్యకర జీవనంలో ఒక శైలిగా ప్రచారం చేస్తూ ఈ మారథాన్ నిర్వహిస్తున్నామని ఎయిర్ టెల్ హైదరాబాద్ మారథాన్ రేస్ డైరెక్టర్ అభిజిత్ మద్నుర్కర్ అన్నారు. హైదరాబాద్ రన్నర్స్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, 7వ ఎడిషన్ ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ నిర్వహిస్తున్నామన్నారు.
హైటెక్స్ ప్రాంగణంలో 5కె రన్:
అగస్టు 20న నిర్వహించే మారథాన్ కోసం.. అగస్టు 19న హైటెక్స్ ప్రాంగణంలో మారథాన్ కర్టెన్ రైజర్ గా 5కె రన్ జరుగనుందని అభిజిత్ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లని పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి:
ఆగస్టు 20న హైటెక్స్ వద్ద ప్రారంభమయ్యే 10కె, హాఫ్ మారథాన్ (21.095 కిలోమీటర్లు), ఫుల్ మారథాన్ (42.195 కిలోమీటర్లు) పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమై గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుందన్నారు. తొలిసారి ఫినీషర్ మెడల్ను నగరానికి చెందిన జువెలరీ డిజైనర్ సుహానీ పిట్టి డిజైన్ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీ ఎయిర్టెల్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, (ఏపీ& తెలంగాణ) వెంకటేష్ విజయ రాఘవన్తో పాటుగా డిజైనర్ సుహానీ పిట్టి తదితరులు పాల్గొన్నారు.