కోర్కె తీర్చాలంటూ సహోద్యోగి వేధింపులు: ప్రిన్సిపాల్ ఆత్మహత్య
హైదరాబాద్: విద్యార్థులకు విద్యా, బుద్ధులు చెప్పి, మంచి మార్గంలో నడిపించాల్సని ఓ ఉపాధ్యాయుడు కీచకుడిలా మారి పాఠశాల మహిళా ప్రిన్సిపాల్ను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అతడి వేధింపులు భరించలేక ఆ ప్రిన్సిపాల్ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నగరంలోని పుప్పాలగూలో చోటు చేసుకుంది.
నార్సింగి ఎస్ఐ ధనంజయ్ కథనం ప్రకారం...లంగర్హౌస్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న శ్రీలత(36) భర్త రవీందర్, కొడుకు(10)తో కలిసి పార్శిగుట్టలో నివసిస్తోంది.
ఆమె పనిచేస్తున్న పాఠశాలలోనే రాపోలు శ్రీధర్(38) ప్రిన్సిపల్(అడ్మిన్)గా పనిచేస్తున్నాడు. కాగా, తన లైంగిక కోర్కెలు తీర్చాలంటూ శ్రీలతను కొంత కాలంగా శ్రీధర్ వేధిస్తున్నాడు. అంతేగాక, బయటకు చెబితే ఉద్యోగం తీయిస్తానని బెదిరింపులకు గురిచేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో అతని వేధింపులకు విసిగిపోయిన శ్రీలత సోమవారం నెక్నాంపూర్ అల్కాపూర్ కాలనీలో ఉంటున్న సోదరుని ఇంటికి వచ్చి అర్ధరాత్రి బాత్రూం కిటికీ గ్రిల్స్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కాగా, మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు గమనించారు. శ్రీధర్ వేధింపులతోనే తమ సోదరి ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి సోదరుడు సంతోష్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శ్రీధర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.