అదేమిటి, కెసిఆర్! చుట్టూ తిప్పుతున్నారు: షబ్బీర్ అలీ
హైదరాబాద్: రీడిజైనింగ్ అంటూ ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చుట్టూ తిప్పుతున్నారని కాంగ్రెసు తెలంగాణ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్లు వచ్చిన వార్తలపై ఆయన శనివారం స్పందించారు.
15 రోజులకు ఓసారి, నెలకు ఓసారి సమీక్షా సమావేశాలు పెట్టి ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుపై రకరకాలుగా మాట్లాడుతున్నారని, ఇందులో వాస్తవం ఏదని ఆయన అన్నారు. ఆ ప్రాజెక్టు రీడిజైనింగ్ అయిందా, అయితే దానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందా అని ఆయన అడిగారు.
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తూ రాష్ట్ర విభజన చట్టంలోనే పొందుపరిచారని, మళ్లీ దానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరడం ఏమిటని ఆయన అన్నారు. రీడిజైనింగ్కు రెండు వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారని, ఎలా ఖర్చు చేశారో వివరాలు చెప్పాలని ఆయన అన్నారు.
కాగా, కెసిఆర్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్ష లేదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్సించారు. 18 నెలల కాలంలో కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆయన అన్నారు.
కరువు కారణంగా రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతుల సమస్యలు పట్టడంలేదని ఆమె శనివారం మీడియా సమావేశంలో దుయ్యబట్టారు.
జూరాల ఆయకట్టు కింద ఎండిన పంటలపై సీఎం కలుగజేసుకొవాలని ఆమె కోరారు. కరువు వల్ల నష్టపోయిన రైతులకు సత్వరమే న్యాయం చేయాలని, ఎకరాకు రూ. 25వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.