కేబినెట్ బెర్త్ కోసమే మోడీ భజన: కవితపై షబ్బీర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్లో చేరాలన్న ప్రణాళికతోనే ఆమె నిత్యం ప్రధాని నరేంద్ర మోడీ భజన చేస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే ప్రస్తుత రైల్వే బడ్జెట్లో తెలంగాణకు కొంత మేలే జరిగిందన్న కవిత.. ఆ మేలేంటో చెప్పాలని అన్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న ఆయన, కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ఎంపీలు విఫలమయ్యారని అన్నారు.
అంతేగాక, అన్యాయానికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులతో వంద సంవత్సరాలైన తెలంగాణలో రైల్వే అభివృద్ధి చెందదని అన్నారు. తెలంగాణకు కేంద్రం రూ. 200 కోట్ల బిచ్చమేసిందని దుయ్యబట్టారు.
దావాను ఎదుర్కొంటాం: పొన్నం
కరీంనగర్: రాష్ట్ర మంత్రి జగదీశ్రెడ్డి తనపై వేసిన పరువు నష్టం దావాను న్యాయపరంగా ఎదుర్కొంటానని కరీంనగర్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ తెలిపారు. జగదీశ్రెడ్డిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ముఖ్యమంత్రి కెసిఆర్ విచారణ జరిపితే ఆధారాలతో సహా రుజువు చేస్తానని చెప్పారు.