కెసిఆర్కు వాస్తు పిచ్చి: షబ్బీర్ అలీ, భట్టీ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే భట్టీ విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు వింతగా ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణ సెక్రటేరియట్ మార్పు వెనక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ఇంతకుముందు హుస్సేన్సాగర్, ట్యాంక్ బండ్పై పడిన కెసిఆర్.. దృష్టి ఇప్పుడు సెక్రటేరియట్ మీద పడిందని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, అంతకుముందు ముఖ్యమంత్రులు కూడా ఈ సచివాలయాల నుంచే పాలన కొనసాగించారని చెప్పారు. వీరందరికి లేని వాస్తు దోషం కెసిఆర్కే ఎందుకు వచ్చిందని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ప్రజలకు చెందిన రాష్ట్ర ఖజనాను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
వాస్దు బాగోలేదని ప్రజా ధనాన్ని వృథా చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. కెసిఆర్కు వాస్తు పిచ్చిపట్టిందని దుయ్యబట్టారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ అన్ని రెడీమేడ్గా ఉంటే.. మళ్లీ వాటిని తొలగించి కడతామనడం సరికాదని అన్నారు. ఎర్రగడ్డ నుంచి చెస్ట్ ఆస్పత్రిని కదిలిస్తే ఊరుకోమని అన్నారు. లీగల్ కూడా తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేసీఆర్ ప్రతి నిర్ణయం వెనక రహస్య అజెండా ఉందని ఆరోపించారు.
కెసిఆర్ నిర్ణయాలను చూస్తుంటే.. మాఫియాతో కుమ్మక్కైనట్లు కనిపిస్తోందని షబ్బీర్ అలీ అన్నారు. కెసిఆర్ ఇచ్చిన హామీలలో ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని షబ్బీర్ అలీ ఆరోపించారు. కెసిఆర్ సిఎం పదవి నుంచి తప్పుకుంటేనే వాస్తు బాగుంటుందని అన్నారు. సెక్రటేరియట్ మార్చడానికి అది ఆయన జాగీర్ కాదని అన్నారు. ఫాస్ట్ మాదిగానే పింఛన్ల విషయంలోనూ కెసిఆర్ తన తీరును మార్చుకోవాలని షబ్బీర్ అలీ అన్నారు. అర్హులైన పేదలు, మహిళలకు పింఛన్లు అందేలా చూడాలని డిమాండ్ చేశారు.
మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సెక్రటేరియట్ను తరలిస్తే ఊరుకోమని చెప్పారు. తెలంగాణ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. రైతు ఆత్మహత్యలను కెసిఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెన్నుపోటు భయంతోనే కెసిఆర్కు వాస్తు దోషం పట్టుకుందని అన్నారు.
తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్జీవో నాయకులు పదవులకు ఆశపడి తెలంగాణ ప్రభుత్వానికి లాలూచీ పడ్డారని ఆరోపించారు. ఇది ఇలా ఉండగా, సిపిఐ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.