ఓటమి కాంగ్రెస్ది కాదు, సర్వేది: శంకర్రావు, రాజయ్య కోడలు మృతి సహా... కారణాలెన్నో!
హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పైన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శంకర రావు బుధవారం నాడు స్పందించారు. ఆయన చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. వరంగల్ ఉప ఎన్నిక ఫలితంపై మాట్లాడారు.
ఈ ఎన్నికలో ఓడింది కాంగ్రెస్ పార్టీ కాదని, అభ్యర్థి సర్వే సత్యనారాయణ అన్నారు. సర్వే స్థానికుడు కాకపోవడం వల్లే వరంగల్ ప్రజలు ఓడించారన్నారు. గత ఏడాది మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన ఆయనకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని శంకర రావు అన్నారు.
మాకు తక్కువ ఓట్లు వచ్చాయనడం సరికాదు: చాడ
వరంగల్ ఉప ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థి గాలి వినోద్ కుమార్కు తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పడం సరికాదని సిపిఐ నేత చాడ వెంకట రెడ్డి అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాల పైనే తమ పోరాటం అన్నారు. టిఆర్ఎస్ ఇచ్చిన హామీల పైన ప్రజల్లో ఇంకా విశ్వాసం ఉందని, అందుకే గెలిపించారన్నారు.
కాంగ్రెస్ ఓటమి వెనుక...!
కాంగ్రెస్ పార్టీకి వరంగల్ ఉప ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. ఓటమి విషయం పక్కన పెడితే కనీసం దరావత్తు కూడా దక్కించుకోలేకపోయింది. 2014 కంటే 1.12 లక్షల ఓట్లు తక్కువగా వచ్చాయి. మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో.. ఆయన కోడలు, మనవళ్ల మృతి ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ పైన పడిందంటున్నారు.
వరంగల్ జిల్లా చరిత్రలోనే పార్టీ తొలిసారిగా ఎన్నికల్లో ధరావతు కోల్పోయింది. తాజా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు పైన ఆశలు పెట్టుకున్నప్పటికీ... నామినేషన్ల నాటి నుంచి ఎదురైన పరిణామాలు ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయని అంటున్నారు.
పార్టీ అభ్యర్థిగా మొదట ఎంపిక చేసిన సిరిసిల్ల రాజయ్య ఇంట్లో విషాదం ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపింది. చివరి నిమిషంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను ఎంపిక చేసి బరిలోకి దింపినా ఆయనకు ఓటర్ల మద్దతు లభించలేదు.
పార్టీ సంస్థాగత సమస్యలు, నేతల మధ్య సమన్వయ లోపం, కార్యకర్తలు ఆసక్తి చూపకపోవడం తదితర కారణాలు కాంగ్రెస్ను దెబ్బతీశాయంటున్నారు. ప్రజావ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావించినా ఆ దిశగా కార్యచరణ కనిపించలేదంటున్నారు.
స్థానిక నేతలు ఎక్కువ మంది ఉన్నా గుర్తింపు గల నేతల కోసం కాంగ్రెస్ యత్నించింది. లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్ను, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ తదితరులను పోటీ చేయించాలని చూసినా వారు ముందుకు రాలేదు.
మొదట్లో సర్వే సత్యనారాయణ వైపు మొగ్గు చూపినా పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు సిరిసిల్ల రాజయ్యకే అవకాశం ఇవ్వాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత రాజయ్య ఇంట్లో కోడలు, ముగ్గురు పిల్లలు సజీవ దహనం కావడం కలకలం రేపింది. ఆయనను పోటీ నుంచి తప్పించి, సర్వేను బరిలోకి దించారు.
సర్వే గడువుకు పది నిమిషాల ముందే నామినేషన్ దాఖలు చేసి బరిలో నిలిచారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని జాతీయ, రాష్ట్రస్థాయి అగ్రనేతలంతా విస్తృత ప్రచారం చేసినా ఫలితం కనిపించలేదు. పొన్నాల లక్ష్మయ్య సహా పలువురికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా నష్టం కలిగించిందని అంటున్నారు. సర్వే స్థానిక అభ్యర్థి కాకపోవడం కూడా నష్టం చేసిందని చెబుతున్నారు. ఆయన స్థానిక నేతలు కలుపుకొని పోలేదంటున్నారు.