డిసెంబర్ 8 నుండి షర్మిల పరామర్శ, ఆ తర్వాత..
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, ఆ పార్టీ నాయకురాలు షర్మిల తెలంగాణలో పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మృతిని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల డిసెంబర్ 8వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లాలో పరామర్శ యాత్రను ప్రారంభించనున్నారు.
ఇందులో భాగంగా ఆమె జిల్లాలో 4 నుండి 5 రోజుల పాటు షాద్ నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, మక్తల్, కొడంగల్, వనపర్తి, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తారు. వైయస్ మృతిని తట్టుకోలేక మృతి చెందిన 16 కుటుంబాలను పరామర్శిస్తారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఖమ్మం జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టారు. పలు కారణాలతో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఓదార్పు కార్యక్రమం సాగలేదు. దీంతో తాజాగా షర్మిల పరామర్శ యాత్రకు సిద్ధమయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాలో యాత్ర పూర్తయ్యాక తెలంగాణలోని మిగతా జిల్లాల్లో షర్మిల పర్యటిస్తారు.