ఆమె దొంగతనం అంటే.. ఎస్సై అత్యాచారయత్నం అన్నాడు!
చోరీ ప్రయత్నం జరిగిందని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. న్యాయం చేయాలని వేడుకున్న ఆమెపైనే రక్షభటులు నింద మోపారు.
ఖమ్మం: చోరీ ప్రయత్నం జరిగిందని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. న్యాయం చేయాలని వేడుకున్న ఆమెపైనే రక్షభటులు నింద మోపారు. తనపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదు ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా ఆమెకు తీరని అన్యాయం జరిగింది.
దీని ఆధారంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని గ్రామస్థులు సూటిపోటి మాటలతో కుళ్లబొడుస్తున్నారు. గత్యంతరం లేని స్థితిలో ఉన్న ఊరిని వదిలి ఏకాకిలా బతకాల్సి వస్తోంది. చంటి పిల్లలతో ఎనిమిది నెలలుగా దీనంగా బతుకీడుస్తున్నది.
జరిగింది ఇదీ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పొగళ్లపల్లి గ్రామానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ ఇంటిలో 2016 అక్టోబరు 20న అర్ధరాత్రి చోరీ యత్నం జరిగింది. ఇంటి యజమాని అయిన మహిళ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో ఓ యువకుడు ఇంట్లోకి ప్రవేశించి, దొంగతనానికి ప్రయత్నించాడు. దీన్ని గమనించిన ఆమె కేకలు వేసింది. సమీప ఇళ్ల ప్రజలు రావడంతో దొంగ పరారయ్యాడు. చోరీకి వచ్చిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన గొల్ల బాలకృష్ణగా గుర్తించింది. ఇదే విషయమై మరుసటి రోజు ములకలపల్లి పోలీస్స్టేషన్లో ఎస్ఐ రాంచరణ్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది.
ఎస్ఐ ఒత్తిడి ?
ములకలపల్లి ఠాణాకు వచ్చిన బాధిత మహిళకు చుక్కెదురైంది. తన ఇంట్లో దొంగతనంతోపాటు తనపై అత్యాచారయత్నం జరిగినట్లు కూడా ఫిర్యాదు పత్రం ఇవ్వాలని ఎస్ఐ రాంచరణ్ ఒత్తిడి చేయడంతో అవాక్కయింది. సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా నిందితుడిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోగా, సదరు మహిళ వివాహేతర సంబంధాలకు పాల్పడుతుందని గ్రామంలో ప్రచారం జరుగుతుండడంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితులు నెలకొన్నాయి. ఈపరిస్థితుల్లో నిందను మోయలేక, ఉన్న ఊళ్లో ముఖం చూపలేక భర్త, చంటిబిడ్డతో కలసి గ్రామాన్ని వదిలింది. ఫలితంగా భద్రాచలంలో జీవనం గడుపుతోంది.
ఉన్నతాధికారులను సంప్రదించినా..
జరిగిన అన్యాయంపై పాల్వంచ సీఐ ఎంఏ షుకూర్ను సంప్రదించగా ‘నీ కేసు విషయమై ఎస్ఐ రాంచరణ్, డీఎస్పీ ఇబ్బందిపడతార'ని చెప్పినట్లు బాధితురాలు తెలిపింది. అయితే నేటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె కన్నీటిపర్యంతమైంది. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని పలుమార్లు కలిసి జరిగిన అన్యాయాన్ని విన్నవించగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు బాధితురాలు తెలిపింది. తనపై పడిన నింద పోయే వరకూ తాను గ్రామంలో అడుగుపెట్టనని గంటాపథంగా చెపుతోంది.