నయీం కాల్ డేటా పరిశీలన: ఎవరి జాతకాలు ఎలా బయటపడుతాయో....
హైదరాబాద్: గ్యాంగస్టర్ నయీం సిమ్ కార్డుల డేటాను పరిశీలిస్తే ఎవరి జాతకాలు ఎన్ని ఎలా బయటపడుతాయోననే ఆసక్తి చోటు చేసుకుంది. నయీం కాల్ డేటా రికార్డులు ప్రకంపనలు సృష్టించే అవకాశాలు కూడా ఉన్నాయి. నయీంతోపాటు అతని అనుచరుల ఇండ్లలో దొరికిన 500 సిమ్కార్డులను సిట్ అధికారులు విశ్లేషిస్తున్నారు. సిమ్కార్డులలో ఉన్న ప్రముఖుల నెంబర్లతోపాటు, నయీం బలవంతపు వసూళ్ల చిట్టాను బయటకు తీయనున్నారు.
నయీం సిమ్కార్డుల నుంచి లభించే ఆధారాలు, కాల్ డేటా రిపోర్టులను అధికారులు సాక్ష్యాలుగా భద్రపరుస్తారు. సిమ్కార్డుల విశ్లేషణ కోసం వందల టవర్ల లొకేషన్లను సిట్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఏ రోజు ఎవరితో ఎవరు మాట్లాడారనే సమాచారం దీంతో తేలే అవకాశం ఉంది. నయీంతో చేతులు కలిపిన ఘరానా పెద్ద మనుషుల అసలు రూపాలు బయటపడవచ్చునని కూడా అంటున్నారు.
సిమ్కార్డులలో ఉన్న సంక్షిప్త సమాచారాలను సిట్ అధికారులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం అధికారులు సైబర్క్రైమ్ నిపుణులతోపాటు సీఐడీ, హైదరాబాద్, సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు. పోలీసులు అందుబాటులోకి తెచ్చుకున్న ఆధునిక సాంకేతిక పరిజానంతో సిమ్కార్డుల హిస్టరీని ఛేదిస్తున్నారు. మరోవైపు సిమ్కార్డులలో మాయమైన సమాచారం కూడా వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనికోసం జంట కమిషనరేట్లలోని ఐటీ సెల్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఈ సిమ్కార్డులకు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించారనే కోణంలో, సిమ్కార్డు విక్రేతలను ప్రశ్నిస్తున్నారు. నయీం డెన్లలో లభ్యమైన వందల సెల్ఫోన్ల ఐఎంఈఐ నెంబర్ల ఆధారంగా, నయీం ఎక్కడెక్కడ తిరిగాడనే విషయాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరిస్తున్నారు.
నయీం ఉపయోగించిన సెల్ఫోన్ నెంబర్లను నిర్ధారిస్తే వాటి ఫలితంగా తమ స్థలాలు, ఆస్తులు తిరిగి లభించే అవకాశాలున్నాయని వందల సంఖ్యలో బాధితులు ఎదురు చూస్తున్నారు. తమ భూములను కబ్జా చేసిన నయీం బెదిరింపులకు ఉపయోగించిన నంబర్లను కొందరు ఫి ర్యాదులో పేర్కొన్నారు. బాధితులు ఇచ్చిన నంబ ర్లు, పోలీసులు నయీందని నిర్ధారించిన నంబర్లు సరిపోలితే బెదిరింపులు వాస్తవమనేది శాస్త్రీయంగా రుజువవుతుం దని అంటున్నారు.