నయీంతో సంబంధాలున్న నేతలకు బిగుస్తున్న ఉచ్చు, జాబితా రెడీ
గ్యాంగ్ స్టర్ నయీం కేసులో సిట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. నయీంతో అంటకాగిన పోలీసులపై ఇప్పటికే చర్యలకు సిఫారసు చేసిన సిట్ మరో వైపు రాజకీయనాయకులు, ప్రజాప్రతినిధులపై కూడ ఉచ్చును బిగించేందుకు రంగం
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో సిట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. నయీంతో అంటకాగిన పోలీసులపై ఇప్పటికే చర్యలకు సిఫారసు చేసిన సిట్ మరో వైపు రాజకీయనాయకులు, ప్రజాప్రతినిధులపై కూడ ఉచ్చును బిగించేందుకు రంగం సిద్దం చేసింది.
ఇప్పటికే ఏడుగురు నాయకులకు సంబంధించిన జాబితాను ప్రభుత్వానికి పంపగా మిగతావరి జాబితాను కూడ సిద్దం చేస్తోంది. నయీంతో ఉన్న సంబంధాలకు సంబంధించిన ఆధారాలతో సహా ఈ జాబితాను సిద్దం చేస్తున్నారు.
గ్యాంగ్ స్టర్ నయీంకు అనేకమంది నాయకులు, ప్రజాప్రతినిధులు అడుగులకు మడుగులొత్తారు. పరోక్షంగా అతడి నేరాలకు సహకరించారు. వీరిలో నల్గొండ జిల్లాకు చెందిన శాసనమండలి చైర్మెన్ నేతి విద్యాసాగర్ రావు, భువనగిరి టిఆరఎస్ నాయకుడు చింతల వెంకటేశ్వర్ రెడ్డి పేర్లు పోలీసుల రికార్డుల్లోకి ఎక్కాయి.
వీరితో పాటు టిఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కూడ నయీంతో సన్నిహిత సంబంధాలున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. తొలిదశలో వీరిపై చర్యలు చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు.
మరో వైపు చిన్న చితక నాయకులు కూడ నయీంతో మంచి సంబంధాలను కలిగిఉన్నారు. తమ పరిధిలోని ఆస్తివివాదాలను నయీం ద్వారా పరిష్కరించుకొన్నారు. ప్రతిఫలంగా ఆస్తులు కూడబెట్టుకోవడంతో పాటు కొందరైతే ఏకంగా బెదిరించి బలవంతంగా కబ్జాలు చేశారు.
తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తులో వెల్లడైన అంశాలు, నయీం డైరీలో రాసుకొన్న పేర్లు తదితర వివరాల ఆధారంగా పోలీసులురాజకీయనాయకులకు సంబంధించి పెద్ద చిట్టానే తయారు చేశారు.
కొందరు నాయకులు నయీం తరపున హత్యలకు పాల్పడ్డారని సిట్ గుర్తించింది. ఇప్పుడు ఇటువంటి నాయకులపై చర్యలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. నయీంపై రాష్ట్రంలో అనేక కేసులు నమోదయ్యాయి.
పోలీస్ స్టేషన్ల వారీగా ముందుగా నోటీసులు ఇచ్చి ఆ తర్వాత తదుపరి చర్యలు చేపట్టబోతున్నారు.ఎవరెవరికీ ఏ స్థాయిలో ప్రమేయం ఉందన్నదానిపై ఇప్పటికే స్పష్టత వచ్చిందని నయీం కేసులో ఏ ఒక్కరినీ కూడ వదిలే ప్రసక్తే లేదని పోలీసులు చెబతున్నారు.