డ్యాంలో ఈతకు వెళ్లి ఆరుగురు చిన్నారుల మృతి
కరీంనగర్: జిల్లా కేంద్రంలోని కట్టారాంపూర్లో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంకు సమీపంలో ఉన్న లోయర్ మానేరు డ్యాంకు ఈతకు వెళ్లిన ఆరుగురు బాలురు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు డ్యాంలో గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు.
డ్యాం నుంచి ఐదుగురి మృతదేహాలను వెలికి తీయగా, మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతులంతా 14 ఏళ్లలోపు పిల్లలే. డ్యాంలోకి ఈతకు వెళ్లి మునిగిపోయినట్టు తెలుస్తోంది.
మృతులను సాయిసృజన్(14), గోపి(14), ప్రద్యుమ్న(11), సౌమిత్, సుమిత్, శివసాయిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు కవల పిల్లలు సౌమిత్, సుమిత్ ఉన్నారు. కరీంనగర్లోని రాంనగర్ కాలనీకి చెందిన ఈ పిల్లలు సోమవారం ఉదయం క్రికెట్ ఆడుకునేందుకు బయటికి వచ్చారు.
ఆ తర్వాత ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు డ్యాంలో ఈతకు వెళ్లారు. లోతులోకి వెళ్లడంతో ఆరుగురు పిల్లలు గల్లంతైనట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.