'స్నేక్ గ్యాంగ్'పై 22న ట్రయల్ షెడ్యుల్ ఖరారు: ఆదుకున్న ఫ్రెండ్ భార్యపై రేప్
హైదరాబాద్: భాగ్యనగర శివార్లలో అకృత్యాలతో కొద్ది నెలల క్రితం సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ కేసులో ఈ నెల 22వ తేదీన ట్రయల్ షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా 14వ అదనపు జిల్లా కోర్టులో సోమవారం ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున పిటిషన్ దాఖలైంది.
ఈ సందర్భంగా జరిగిన వాయిదాకు సైబరాబాద్ పోలీసులు చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి తొమ్మిది మంది నిందితులను హాజరుపరిచారు. వాదనలు విన్న మేజిస్ట్రేట్ వరప్రసాద్ కేసును 22వ తేదీకి వాయిదా వేశారు. షెడ్యూల్ ఖరారయినందున రోజుల్లో తీర్పు వెలువడే అవకాశాలున్నాయి.
2014 ఆగస్ట్లో పహాడీషరీఫ్లోని ఓ ఫాంహౌస్లో ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో తొమ్మిది మంది నిందితులుగా ఉన్నారు. బాధితురాలిని పాముతో బెదిరించి దురాగతానికి పాల్పడడం అప్పట్లో సంచలనం సృష్టించింది. నిందితులపై పీడీ చట్టం ప్రయోగించడంతో ప్రస్తుతం వారంతా చర్లపల్లి జైలులో ఉన్నారు.
స్నేహితుడి భార్యపై అత్యాచారం, అరెస్ట్
స్నేహితుడని నమ్మి నగరంలో పనికి కుదిర్చి అతని ఇంట్లోనే ఆశ్రయం కల్పించిన వ్యక్తి భార్య పైనే కన్నేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని అఫ్జల్గంజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
బీహార్ రాష్ట్రానికి చెందిన రాజేందర్ దాస్ ఉపాధి నిమిత్తం కొంతకాలం క్రితం నగరానికి వచ్చి ఓ సంస్థలో పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితమే వివాహం జరిగింది. భార్యతో కలిసి మహారాజ్గంజ్లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. బీహార్కు చెందిన అతని స్నేహితుడైన ముఖేష్ దాస్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చాడు.
గత ఏడాది డిసెంబరు 22న అతనికి రాజేందర్ దాస్ ఓ సంస్థలో ఉద్యోగం ఇప్పించాడు. అతను నివాసం ఉంటున్న గది సమీపంలోనే అద్దె ఇంట్లో ఉంటున్న ముఖేష్ దాస్... రాజేందర్ దాస్ భార్య ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె కాళ్లు చేతులు కట్టేసి అదే నెలలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ విషయం భర్తకు చెప్తే చంపేస్తానని బెదిరించి పారిపోయాడు. బాధితురాలు జరిగిన సంఘటనపై అఫ్జల్గంజ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని తప్పించుకు తిరుగుతున్న రాజేందర్ దాస్ను సోమవారం ఉదయం సీబీఎస్ వద్ద అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.