పెళ్లైన మూడు నెలలకే మహిళా సాప్ట్వేర్ ఇంజనీర్ మృతి
హైదరాబాద్: పెళ్లైన మూడు నెలలకే ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నగరంలోని సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన హరికీర్తన(25) వివాహం అదే ప్రాంతానికి చెందిన భానుతేజ అనే యువకుడితో గత మార్చిలో జరిగింది.
హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న ఈ జటం సనత్ నగర్లోని ఎస్ఆర్టీ కాలనీలో నివాసముంటోంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో హరికీర్తన తన గదిలోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో హరికీర్తన ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
ఆమె ఉరి వేసుకుని చనిపోయిందని అత్తంటి వారు చెబుతుండగా, హరికీర్తన మృతిపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వరకట్న వేధింపులే తమ కూతురి ఆత్మహత్యకు కారణమంటూ సనత్ నగర్ పోలీస్స్టేషన్లో మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఈతకు వెళ్లి బాలుడి మృతి
ఈతకు వెళ్లి బాలుడు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండలంలోలని చల్లా గోదాముల సమీపంలో ఉన్న ఓ బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ మహ్మద్ రియాజ్ మోబిన్(14) అనే బాలుడు మృతిచెందాడు.
ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నాం జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోబిన్తో పాటు గఫూర్, తాజుద్దీన్ అనే మరో ఇద్దరు బాలురు ఈతకు వెళ్లారు. మోబిన్ బావిలో మునిగిపోవడంతో మిగతా ఇద్దరు భయంతో పరారయ్యారు. బుధవారం ఉదయం వీరిద్దరూ వారి కుటుంబసభ్యులకు తెలపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో బాధిత యువకుడి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పారు. రియాజ్ మోబిన్ మృతదేహాన్ని బావిలో నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.