టెక్కీ అదృశ్యం: ఫోన్ స్విచ్చాఫ్, చివరి ఫోన్ ఎవరికి.. పోలీసుల ఆరా
హైదరాబాద్: టిసిఎస్ కంపెనీలో సాఫ్టువేర్ ఇంజినీర్గా పని చేస్తున్న కర్నాటకకు చెందిన అనుశ్రీ అదృశ్యానికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆమె ఉంటున్న హాస్టల్లోని సీసీటీవీ ఫుటేజీలో అనుశ్రీకి సంబంధించిన దృశ్యాలను సేకరించారు. ఆమె వెళ్లిన మార్గంలోనే మిగతా కెమెరాలను పరిశీలిస్తున్నారు.
కర్నాటకకు చెందిన అనుశ్రీ సోమవారం నాడు కార్యాలయానికి వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైన విషయం తెలిసిందే. ఆమె కర్నాటకకు చెందిన యువతి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
సోమవారం అనుశ్రీ అందరితోపాటు కార్యాలయానికి వెళ్లారని, ఎప్పుడు ఆమె డల్గా కనిపించేది కాదని, బాగా మాట్లాడుతుందని, అయితే శుక్రవారం నాడు ఊరి నుంచి వచ్చాక కొంత డల్గా ఉన్నారని, ఎందుకని అడిగితే ఏం లేదని చెప్పారని హాస్టల్లో ఉంటున్న వారు చెబుతున్నారు.
పోలీసులు హాస్టల్లోని సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేశారు. ఆమె వెళ్లిన వైపున ఉన్న మిగతా సీసీ కెమెరాలు పరిశీలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె మొబైల్ డాటాను తీసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మొబైల్ ఫోన్ స్విచ్చాప్ చేసి ఉంది. ఆమె ఫోన్ ఎక్కడ స్విచ్చాఫ్ అయింది, ఆదివారం రాత్రి నుంచి ఆమెకు ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చాయి, ఎవరికి ఫోన్లు చేశారో పోలీసులు ఆరా తీస్తున్నారు.