ఇంటా బయటా: కెసిఆర్పై పార్టీలోనే గుర్రు, ఎవరికీ చెప్పే ధైర్యంలేదా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన పార్టీలోనే పలువురు అసంతృప్తితో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని అందలం ఎక్కించుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు.
కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన డి శ్రీనివాస్ను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆయితే, ఆయనకు ఉన్న అనుభవం దృష్ట్యా కెసిఆర్ ఆయనను నియమించారని చెబుతున్నారు. అయినప్పటికీ చాలామంది దీనిని జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు.
అంతకుముందు, టిడిపి నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావు వంటి వారికి మంత్రి పదవులు ఇచ్చారని, ఇప్పుడు డిఎస్ను అందలం ఎక్కించారని వాపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
మొదటి నుంచి పార్టీలో ఉన్న తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. డి శ్రీనివాస్కు కేబినెట్ ర్యాంక్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే అందలం ఎక్కిస్తే పార్టీ కిందిస్థాయి వరకు, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆందోళన కూడా చాలామందిలో కనిపిస్తోందని అంటున్నారు. అయితే, దానిని ముఖ్యమంత్రి కెసిఆర్ వద్ద చెప్పే ధైర్యం ఎవరికీ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
తలసానికి, తుమ్మలకు, ఇప్పుడు డి శ్రీనివాస్కు పదవులు ఇవ్వడంపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోందని అంటున్నారు. తలసాని వంటి వారు మంత్రిగా ఉండటం ఎంత వరకు నైతికత అనే ప్రశ్న పలువురు టీఆర్ఎస్ నేతల్లోను తలెత్తుతోందని అంటున్నారు. ఇవి పార్టీకి చిక్కులు తెస్తాయని ఆందోళన చెందుతున్నారంటున్నారు.
మరోవైపు, విపక్షాలు కూడా ఈ అంశాల ఆధారంగా ప్రభుత్వం పైన భగ్గుమంటున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని అందలమెక్కించడాన్ని ప్రశ్నిస్తున్నాయి. అయితే, కొత్తగా ఏర్పడిన తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలంటే అనుభవం కలిగిన నాయకులకు అవకాశమిస్తున్నారనే వారు లేకపోలేదు.
అదే సమయంలో నీరు, ఉద్యోగాలు అంటూ తెలంగాణ తెచ్చుకున్నామని, ఇప్పుడు ఆ దిశగా కెసిఆర్ పాలన నడవడం లేదని, దానిని నిలదీస్తామని విపక్షాలు చెబుతున్నాయి. ఇందు కోసం నాగం జనార్ధన్ రెడ్డి బచావో తెలంగాణను తెరపైకి తీసుకు వచ్చారు. కెసిఆర్ ప్రభుత్వం పైన విపక్షాలు క్రమంగా గొంతు పెంచుతున్నాయి.
విపక్షాలు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ప్రాజెక్టుల డిజైన్ మార్పులు, ఉద్యోగాల విషయంలో మండిపడుతున్నాయి. ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుండటం గమనార్హం.