ఎమ్మెల్యేలకు కేసీఆర్ బంపరాఫర్: ఇళ్ల కోసం రూ.119 కోట్లు, రేపే తొలి ఇల్లు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొద్ది రోజుల క్రితం రూ.40 కోట్ల విలువైన క్యాంప్ కార్యాలయంలోకి అడుగు పెట్టారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొద్ది రోజుల క్రితం రూ.40 కోట్ల విలువైన క్యాంప్ కార్యాలయంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత ఇటీవలే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రూ.5 కోట్ల మొక్కు చెల్లించుకున్నారు.
తెలంగాణ వస్తే శ్రీవారికి కానుకలు ఇస్తానని గతంలో కేసీఆర్ మొక్కుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. ఆయన సీఎం అయ్యారు. దాదాపు మూడేళ్లకు ఆయన ఇటీవలే మొక్కు తీర్చుకున్నారు.
అయితే రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కరువు ఉన్నప్పుడు కేసీఆర్ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. ప్రతిపక్షాలు పలు సందర్భాల్లో రాష్ట్రంలోని కరువును లేవనెత్తారు.
అంతేకాదు, సీఎం కేసీఆర్ ఒక్కో ఎమ్మెల్యేకు ఇల్లు మరియు ఆఫీస్ కోసం రూ.కోటి ఇస్తున్నారు. తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.కోటి అంటే రూ.119 కోట్లు అవుతుంది.
ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఇళ్లు సిద్ధమవుతున్నాయి. తొలుత పరకాల ఎమ్మెల్యే ఇల్లును రేపు (గురువారం) ప్రారంభించనున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల భవనాల కోసం రూ.1 కోటి విడుదల చేశారు.
తమకు నియోజకవర్గాలలో ఇళ్లు లేవని, అందుకో వెళ్లలేకపోతున్నామని పలువురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ వద్ద చెప్పారు. దీంతో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ఎమ్మెల్యే ఇల్లు కమ్ ఆఫీస్ కోసం రూ.1 కోటి మంజూరు చేశారు.
ప్రతి నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే నివాసం రెండు ఫ్లోర్లతో ఉంటుంది. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ కార్యాలయంగా ఉపయోగిస్తారు. ఇందులో వీవీఐపీ లాంజ్ ఉంటుంది. అలాగే, మద్దతుదారులు, కార్యకర్తల హాల్ ఉంటుంది. వెయిటింగ్ గది ఉంటుంది. అందులోనే ఎమ్మెల్యే కార్యాలయం ఉంటుంది.
రెండో ఫ్లోర్ నివాసానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో మూడు బెడ్ రూంలు, డ్రాయింగ్ రూం, డైనింగ్ హాల్, కిచెన్, స్టోర్ రూం, పూజా గది, స్నానపు గదులు ఉంటాయి.
అయితే, ఇప్పటికే తెలంగాణ లోటు బడ్జెట్లో ఉందని, పైగా రైతులు కరువుతో ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటప్పుడు కేసీఆర్ కోట్లాది రూపాయలతో ఇల్లు నిర్మించుకోవడం, అందరికీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం ఏమిటనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.