"సొంత ఖర్చులతో.. తెలంగాణలో పవన్ చేసిన మంచిపని"
హైదరాబాద్ : ఏపీతో పోల్చితే.. తెలంగాణలో జనసేన ప్రస్తావన కాస్త తక్కువే. ముఖ్యంగా ఏపీ రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్.. తన పార్టీని ఎక్కువగా ఆంధ్రాకే పరిమితం చేశారు. దీంతో తెలంగాణ పాలిటిక్స్ లో జనసేన ప్రస్తావన అడపా దడపా మాత్రమే వినిపిస్తూ ఉంటోంది.
ఇక తాజాగా తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ఓ నేత పవన్ కళ్యాణ్ గురించి జనసేన పార్టీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ నేత శ్రావణ్ కుమార్ గతంలో తాను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ను దగ్గరిగా చూసిన వ్యక్తిగా కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు.
ఇంతకీ శ్రావణ్ ఏం చెప్పారంటే.. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ కోసం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అదిలాబాద్ జిల్లా నార్నూరు గ్రామానికి పవన్ తో పాటు తాను వెళ్లానని చెప్పారు శ్రావణ్. ఈ సందర్బంగా.. అక్కడి మహిళలంతా తాగునీటి కోసం పడుతున్న కష్టాలను చూసి పవన్ చలించిపోయారని చెప్పారు. బావి ఉన్న చోటు నుంచి వరుసగా కి.మీ వరకు బిందెలు లైన్ లో పేర్చి ఉండడం చూసి.. పవన్ తో పాటు తామంతా బాధపడ్డామని, అనంతరం ఎవరి గదులకు వారు వెళ్లిపోయామని తెలిపారు.
మరుసటి రోజు ఉదయాన్నే.. ఎవరో తలుపు తట్టినప్పుడు అనిపించడంతో.. వెళ్లి తలుపు తీసిన శ్రావణ్ కు ఎదురుగా పవన్ కనిపించారట. 'ఊరిలో మహిళలంతా గుక్కెడు నీటి కోసం అంతలా కష్టపడుతుంటే.. నేనిలా మినరల్ వాటర్ తాగుతుండడం నచ్చట్లేదు, వాళ్ల కోసం ఎమైనా చేయాలి' అని చెప్పి వెళ్లారట.
ఆ మాటలను నిజం చేస్తూ.. అప్పటికప్పుడు తన సొంత ఖర్చులతో గ్రామంలో బోరు వేయించారట పవన్. విశేషమేంటంటే.. అప్పటిదాకా ఆ ఊరిలో చాలానే బోర్లున్నా.. వాటిలో చుక్క నీరు పడలేదు. విచిత్రంగా పవన్ వేయించిన బోరులో నీళ్లు పడ్డాయట. ఇదే విషయాన్ని చెబుతూ.. అదేం మహత్యమో గానీ పవన్ వేయించిన బోరులో నీళ్లు పడ్డాయని ఆశ్చర్యంగా చెప్పుకొచ్చారు శ్రావణ్. నాయకుడిగా పవన్ ఫిట్ అని, అందుకే ఆయన్ను, ఆయన పార్టీని తేలికగా తీసుకునే పరిస్థితి లేదని శ్రావణ్ పేర్కొనడం గమనార్హం.