శిక్షకు సై అంటూ రేవంత్ రెడ్డి సవాల్: రాజకీయం వద్దని టీఆర్ఎస్ దాడి!
హైదరాబాద్: సంక్షేమ హాస్టళ్లలో ఇస్తున్న సన్నబియ్యంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ పైన ఘాటైన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ టిడిపి యువ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై టిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
దొడ్డు బియ్యం పాలిష్ చేసి ఇస్తున్నారని, మనమంతా వెళ్లి కలిసి తిని పరిశీలించుదామని, దీనికి తాను సిద్ధమని, టిఆర్ఎస్ నేతలు సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. టిఆర్ఎస్ నేతలు మాత్రం రేవంత్ రెడ్డి పైన ఎదురు దాడికి దిగారు.
మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ పైన విపక్షాలు రాజకీయం చేయడం తగదన్నారు. దొడ్డు బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చే యంత్రాలు ఎక్కడ ఉన్నాయో ప్రతిపక్షాలు చెప్పాలన్నారు.
ఇన్నేళ్లు అధికారంలో ఉన్న పార్టీలు విద్యార్థులకు ముక్కి పోయిన బియ్యం ఇచ్చాయని, ప్రస్తుతం తాము సరఫరా చేస్తున్న మంచి బియ్యాన్ని చూసి ఓర్వలేక రాజకీయం చేస్తున్నారన్నారు. ఎక్కడ తమ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందోనని అక్కసుతో మాట్లాడుతున్నారన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం రేవంత్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల సవాల్ చేస్తే రేవంత్ రెడ్డి దానిని స్వీకరించారు కూడా.
రేవంత్ మాట్లాడుతూ... రాష్ట్రంలో సన్నబియ్యం మాఫియా కొనసాగుతోందన్నారు. బియ్యం ముసుగులో విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం బదులు దొడ్డు బియ్యం పెడుతూ బియ్యం మాఫియాకు పాల్పుడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఎక్కడైనా నిరూపించేందుకు తాను సిద్ధమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ వేరుగా మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏపీ కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో పని చేస్తున్నారన్నారు. పార్టీలన్ని ఏకమై టీఆర్ఎస్ను బద్నాం చేయాలని చూస్తున్నాయన్నారు.
ఆశా వర్కర్ల సమస్య పరిష్కారం కోసం కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు మాట్లాడారని, చాలాసార్లు కలిశారని గుర్తు చేశారు. రైతు సమస్యల పరిష్కారానికి, వారి అభివృద్ధి కోసం సీఎం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు.
గవర్నర్ను కలిసిన తెలంగాణ బిజెపి ఎమ్మెల్యేలు
రైతు సమస్యలను శాసనసభలో ప్రస్తావిస్తే మూకుమ్మడిగా సస్పెండ్ చేశారని తెలంగాణ బిజెపి శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ బిజెపి ఎమ్మెల్యేల బృందం సాయంత్రం గవర్నర్ నరసింహన్ను కలిసింది.
రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం, ప్రభుత్వ వైఖరిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడారు. రైతు సమస్యలపై ప్రభుత్వానికి నిర్దేశం చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఏకకాలంలో రుణమాఫీ కోసం ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందన్నారు.