విద్యార్థి ఆత్మహత్య: యువతికి వేధింపులు, దాడి
విద్యుత్తు తీగెలు తగిలి ఇద్దరు మృతి
నల్గొండ జిల్లాలోని చందంపేట మండలం ఉస్మాన్కుంటలో విషాదం నెలకొంది. అడవి పందుల వేటకు పెట్టిన విద్యుత్ తీగలు తగలి ఇద్దరు మృతి చెందారు. గత రాత్రి వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన వారికి ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగెలు తగిలి ఘటనా స్థలంలోనే మరణించారు.
భగ్గుమన్న పాతకక్షలు
వరంగల్ జిల్లాలోని పరకాలలో పాతకక్షలు భగ్గుమన్నాయి. శ్రీకాంత్ అనే వ్యక్తిపై ప్రత్యర్ధులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీకాంత్ సహా అతడి తల్లి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కౌకొండ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అదే గ్రామానికి చెందిన అనితను గత కొంతకాలంగా వేధింపులకు గురిచేశాడు. దీంతో అనిత సోదరుడు రాజు తన స్నేహితులతో కలిసి శ్రీకాంత్పై దాడి చేశాడు. అడ్డువచ్చిన అతని తల్లిని గాయపరిచి శ్రీకాంత్ ఇంటికి నిప్పంటించి పరారయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మతిస్థిమితం లేని వ్యక్తి విధ్వంసం
ఇదిలావుంటే, కరీంనగర్ జిల్లా జగిత్యాల కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో మతిస్థిమితం లేని వ్యక్తి హల్ చల్ చేశాడు. బస్టాండ్ సమీపంలోని కొంత మంది వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న పలు వాహనాలను ధ్వంసం చేశాడు. అతడిని పట్టుకునేందుకు స్థానికులు యత్నించి విఫలమయ్యారు.
దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కొత్త బస్టాండ్ చేరుకుని అతి కష్టం మీద అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మతిస్థిమితం లేని వ్యక్తిని పోలీసు స్టేషన్కు తరలిచారు.