దొంగ అంటూ కొట్టడం వల్లే విద్యార్థిని ఆత్మహత్య: ప్రిన్సిపాల్ అరెస్ట్
దొంగ అంటూ తరగతి గదిలో అందరి ముందు కొట్టడం వల్లే మనస్తాపానికి గురైన ఎర్రోళ్ల భవాని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఏసీపీ నర్సింహారెడ్డి తెలిపారు.
సిద్దిపేట: దొంగ అంటూ తరగతి గదిలో అందరి ముందు కొట్టడం వల్లే మనస్తాపానికి గురైన ఎర్రోళ్ల భవాని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఏసీపీ నర్సింహారెడ్డి తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన కళాశాల ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు.
వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు చెప్పారు. జనవరి 5న భవాని తోటి విద్యార్థి నుంచి 100 రూపాయలు చోరీ చేసిందని అనుమానించి తరగతి గదిలో అందరి సమక్షంలో ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి చేయిచేసుకున్నారని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన భవాని కళాశాల భవనం 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
చేయని నేరానికి చితకబాదిన ప్రిన్సిపాల్: కాలేజీపై నుంచి దూకిన విద్యార్థిని
అంతేగాక, ప్రేమ వ్యవహారమే విద్యార్థిని ఆత్మహత్యకు కారణమని నమ్మించేందుకు కళాశాల యాజమాన్యం ప్రయత్నించింది. విద్యార్థిని తల్లిదండ్రులను కూడా తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. కాగా, భవాని ఆత్మహత్యతో పలు విద్యార్థి సంఘాలు.. పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయం ముందు ఆందోళన చేశాయి. విద్యార్థిని మృతికి కారణమైన ప్రిన్సిపాల్ పై చర్య తీసుకుని, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
దీంతో ఈ కేసుపై ఏసీపీ నర్సింహారెడ్డి కళాశాల విద్యార్థులు, విద్యార్థిని సోదరి శివానీలను విచారించారు. కళాశాలలోని సీసీ కెమెరా పుటేజ్లను పరిశీలించారు. ప్రిన్సిపాల్ చేయి చేసుకోవడం వల్లే భవాని ఆత్మహత్య చేసుకుందని నిర్ధారణకు వచ్చారు.
ఈ క్రమంలో ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నారు. విద్యార్థుల పట్ల బోధనాసిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో సిఐ సురేందర్రెడ్డి, ఎస్ఐ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.