ఏటీఎంలపై సర్వే: హైదరాబాదులో షాకింగ్, బెజవాడ కొంచెం బెటర్
హైదరాబాద్/న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రకటన అనంతరం సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంలలో డబ్బులు లేక జనాలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఓ జాతీయ దినపత్రిక 13 నగరాల్లోని 647 ఏటీఎం సెంటర్ల పైన సర్వే చేసింది.
ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయని తెలుస్తోంది. చాలా ఏటీఎంలు పని చేయడం లేదట. హైదరాబాదు పరిస్థితి మరీ దారుణంగా ఉందని సర్వేలో తేలింది. విజయవాడ, విశాఖలలో కొంత మెరుగు అయినప్పటికీ అక్కడా చాలా వరకు పని చేయడం లేదని తేలింది.
క్యాష్ లెస్ ఏటీఎం
దేశంలోని పదమూడు ప్రధాన నగరాల్లో ఈ సర్వే జరిగింది. ఈ సర్వే పూర్తి సారాంశాన్ని గ్రహిస్తే మోడీ తీసుకున్న నిర్ణయం క్యాష్ లెస్ ఎకానమీనా, క్యాష్ లెస్ ఏటీఎంలా అన్న సందేహం కలగక మానదని ఎద్దేవా చేస్తున్నారు.
హైదరాబాద్, బెజవాడలలో దారుణం
మొత్తం 13 నగరాల్లో ఉన్న అరవై తొమ్మిది శాతం ఏటీఎం సెంటర్లలో డబ్బులు లేవని తేలిందని తెలుస్తోంది. హైదరాబాదులో 98 శాతం, విజయవాడలో 87.5 శాతం, విశాఖపట్నంలో 85.3 శాతం ఏటీఎంలు పని చేయడం లేదని తేలింది. హైదరాబాదులో 50 ఐటీఎం సెంటర్లకు గాను ఒక్కటే పని చేస్తున్నట్లు తేలింది.
భువనేశ్వర్ బెస్ట్
భువనేశ్వర్లో 16 శాతం, రాయపూర్లో 45.9 శాతం, చండీఘర్లో 87.5 శాతం, నగపూర్లో 90 శాతం, బెంగళూరులో 88.5 శాతం, మైసూరులో 56 శాతం, త్రివేండ్రంలో 26.8 శాతం, కొచ్చిలో 50 శాతం, చెన్నైలో 87.7 శాతం, కోయంబత్తూర్లో 89.1 శాతం ఏటీఎం సెంటర్లు పని చేయడం లేదని తేలింది.
సామాన్యులకు ఇబ్బంది
అన్ని నగరాల్లో కంటే భువనేశ్వర్లో పరిస్థితి చాలా మెరుగ్గు ఉందని తేలింది. 13 నగరాల్లోని 647 ఏటీఎంలలో సర్వే చేస్తే 451 ఏటీఎం సెంటర్లలో డబ్బులు లేవని తేలింది. నోట్ల రద్దు అనంతరం సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.