స్వప్న.. భాగ్యనగరంలో మరో ప్రత్యూష: ఏడేళ్లుగా సవతి తల్లి చిత్రహింస
హైదరాబాద్: భాగ్యనగరంలో ప్రత్యూష తరహా దారుణమైన సంఘటన మరొకటి మంగళవారం నాడు వెలుగు చూసింది. ఏడేళ్లుగా స్వప్న అనే యువతికి సవతి తల్లి చిత్రహింసలు పెట్టింది. బాలల హక్కుల సంఘం చొరవతో ఆమె బయటపడింది.
హైదరాబాదులోని కుషాయిగూడలో బెనర్జీ అనే రైల్వే రిటైర్డ్ ఉద్యోగి ఉన్నాడు. అతనికి స్వప్న కూతురు. బెనర్జీ భార్య కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. ఆ తర్వాత అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుండి సవతి తల్లి అమ్మాయి స్వప్నను వేధించేది.
ఏడేళ్లుగా ఆమెను గృహనిర్బంధంలో ఉంచింది. ప్రస్తుతం స్వప్న మాట్లాడలేని పరిస్థితిల్లో ఉంది. మానసికంగా కృంగిపోయి ఉంది. ఎవరు మాట్లాడినా... భయభయంగా సవతి తల్లి వైపు చూస్తోంది.
సవతి తల్లి వేధింపుల విషయం తెలిసి బాలల హక్కుల సంఘం స్వప్నను సవతి తల్లి చెర నుంచి విడిపించారు. స్వప్న అక్క ఆరేళ్ల క్రితం మరణించినట్లుగా తెలుస్తోంది. కాగా, ప్రత్యూష అనే అమ్మాయికి సవతి తల్లి వేధించిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.