హైదరాబాద్లో ఏపి సిరంజీ సైకో? : బైక్పై వచ్చి బాలికకు సూదిగుచ్చి పరారీ
హైదరాబాద్: ఉభయగోదావరి జిల్లాల మహిళలను భయాందోళనకు గురిచేసిన సూది దాడుల సైకోలు హైదరాబాద్ వచ్చారా? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం ఉదయం హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి ఇందిరానగర్లో ఓ బాలికకు సూది గుచ్చిన దుండగుడు పరారయ్యాడు.
పాఠశాలకు వెళ్తున్న రమ్య అనే 4వ తరగతి బాలికకు బైక్పై వచ్చిన దుండగుడు సూది గుచ్చాడు. దీంతో ఆ బాలిక కుప్పకూలిపోయింది. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
బాలిక ప్రాణానికి అపాయమేమి లేదని వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆస్పత్రికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఘటనా స్థలంలోని సిసి కెమెరాల ఫుటేజీ పరిశీలించనున్నట్లు తెలిపారు. కాగా, బాలిక రక్త నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించే అవకాశాలున్నాయి.
ఇది ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్లోని తూర్పు, పశ్చిమగోదావరిలో ఇద్దరు సూది సైకోలు చేసిన దాడుల్లో 20మంది మహిళలు గాయపడిన విషయం తెలిసిందే. నిందితుల ఊహా చిత్రాలను విడుదల చేసిన అక్కడి పోలీసులు, వారి కోసం విస్తృత గాలింపు చేపట్టారు.
ఈ సమయంలోనే హైదరాబాద్లో సూది దాడి జరగడంతో అక్కడి నిందితులు నగరానికి వచ్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఉభయగోదావరి బాధితుల రక్తనమూనాలను ల్యాబ్లకు పంపించారు. ఏపి, తెలంగాణలో జరిగిన సూది దాడుల నిందితులు ఒక్కరా? లేక వేరా? అనే దానిపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, పాఠశాల నుంచి వెళ్లే సమయంలో ముసుగు వేసుకున్న వ్యక్తి సూది గుచ్చి వెళ్లిపోయాడని బాధిత బాలిక తెలిపింది. గ్రీన్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంటు వేసుకున్నాడని చెప్పింది. దాడి చేసిన వ్యక్తి హీరోహోండా బైక్పై వచ్చినట్లు బాలిక చెప్పింది. బాలికకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారని బాలిక తల్లి తెలిపింది.