గెలిస్తే ఎంత, గెలవకపోతే ఎంత: గ్రేటర్పై తలసాని
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే ఎంత, గెలవకుంటే ఎంత అని తెలంగాణ రాష్ట్ర మంత్రి, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజధాని హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ ప్రభుత్వ బాధ్యతగా తీసుకొని ప్రజలను చైతన్యం చేసి విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్ అంటూ విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై తలసాని ఘాటుగా స్పందించారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిస్తే ఎంత, గెలవకుంటే ఎంత అని వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపు దేశ ప్రజలను, రాజకీయ పార్టీలనూ కదిలించింది. రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్ని పార్టీల నాయకులు ఒక ఉద్యమంలా పాల్గొంటున్నారు. మజ్లిస్ పార్టీ కూడా స్వచ్ఛ హైదరాబాద్లో పాల్గొన్నారు.
ఆ పార్టీ అధ్యక్షుడు, లోకసభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సోమవారం సైదాబాద్ దోబీఘాట్ ప్రాంతంలో పాల్గొన్నారు. హైదరాబాద్ను సుందర నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.