తలసాని టీడీపీ సభ్యుడు: అలీ, అదో గెలుపా: ఎర్రబెల్లి
హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ సభ్యుడని, విపక్ష నేత కౌన్సిల్లో బిల్లు ఎలా పెడతారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ శుక్రవారం ప్రశ్నించారు. తలసాని టీడీపీ సభ్యుడని సభాపతి గురువారం ప్రకటించారని, స్పీకర్ నిర్ణయాన్ని కూడా అమలు చేయరా అని ప్రశ్నించారు.
అదీ ఓ గెలుపేనా: పల్లా గెలుపుపై ఎర్రబెల్లి
నల్గొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని రెండో ప్రాధాన్యత ఓట్లతో తెలంగాణ రాష్ట్ర సమితి గెలవడం సిగ్గుచేటని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. తెరాస ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ మరిచారన్నారు. సభలో నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు ఉందన్నారు. తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి రామ్మోహన్ రావు పైన రెండో ప్రాధాన్యత ఓటు ద్వారా గెలిచారు.
నాంపల్లి కోర్టుకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని లాయర్ గోవర్థన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని అన్నారు. కేసీఆర్ తన బంధువులకు ప్రభుత్వ ఆస్తులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఆధారాలు బయటపడితే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ బంధువులతో కేసులు వేయిస్తున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము భయపడేది లేదని, న్యాయస్థానంలో పోరాడతామని పేర్కొన్నారు. ప్రభుత్వ అవినీతిని వెలికితీస్తామన్నారు.