ఆ నటులను వదిలేది లేదు: సినీ పెద్దలతో భేటీ అంటూ డ్రగ్స్ కేసుపై తలసాని హెచ్చరిక
రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న డ్రగ్ కేసుపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. సిట్ విచారణలో వెల్లడైన వాస్తవాల.
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న డ్రగ్ కేసుపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. సిట్ విచారణలో వెల్లడైన వాస్తవాల ఆధారంగా సినీ పరిశ్రమలోని నటీనటులపై చర్యలు తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలంపై తలసాని తొలిసారి స్పందించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సిట్ వద్దనున్న సాక్ష్యాల ఆధారంగా కొంతమంది సినీ ప్రముఖులను విచారిస్తున్నామని తెలిపారు. సిట్ విచారణ పూర్తయ్యాక చిత్ర పరిశ్రమ పెద్దలతో సమావేశం కానున్నట్లు తెలిపారు.
డ్రగ్స్ వివాదంలో సినీ పరిశ్రమ రెండు వర్గాలుగా చీలిపోయిందన్న మాట వాస్తవం కాదని అన్నారు. అంతేగాక, ఈ వ్యవహారాన్ని మొత్తం పరిశ్రమకే ఆపాదించడం సరికాదని తలసాని అన్నారు. మాదక ద్రవ్యాల వ్యవహారం వ్యక్తిగతమైదని... సంబంధిత శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు.
గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో పెద్దల నుంచి పిల్లల వరకు డ్రగ్స్ మహమ్మారి అంటుకుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. మత్తు పదార్థాల వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయన్న సమాచారంతో దీనిపై ప్రభుత్వం సీరియస్గా స్పందించిందని తలసాని తెలిపారు.