‘పథకాల పేరుతో దోపిడీ: గుత్తేదారులు, అధికారులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం’
ఎన్నో భూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం గుత్తేదారులు, అధికారులకే కొమ్ముకాస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.
వరంగల్: ఎన్నో భూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం గుత్తేదారులు, అధికారులకే కొమ్ముకాస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సామాజిక సమన్యాయం కోసం చేస్తున్న మహాజన పాదయాత్ర సోమవారం సాయంత్రం తాడ్వాయికి చేరింది. పాదయాత్రకు సీపీఎం నాయకులు నర్సింహులు, బొప్ప సమ్మయ్య, ఈసం బుచ్చయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ తదితరులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం మిషన్కాకతీయ, భగీరథల తదితర పథకాలతో పేరు దోపిడీ చేస్తోందని, గుత్తేదారుల జెబులు నింపుతోందని మండిపడ్డారు.
దశాబ్దాలకాలంగా సాగుచేసుకుంటున్న గిరిజనుల పోడు భూములను హరితహారం పేరుతో స్వాధీనం చేసుకుంటుందని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టింస్తుందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు దళితులకు మూడెకరాల భూమి, అందరికీ డబుల్బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అంటూ చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రస్తుతం ఆ మాటే ఎత్తడం లేదన్నారు.
ఇలాంటి ఎన్నో సమస్యల సాధనకు తాము పోరాటం చేస్తున్నామని, తమకు అన్ని వర్గాల వారు సహకారం అందించాలని కోరారు. కొండపర్తి, మొండ్యాలతోగు సమీపంలో ఉన్న గుత్తికోయల నివాసాలకు వెళ్లి వారి సమస్యలను అడిగితెల్సుకున్నారు. అటవీశాఖాధికారులు, సిబ్బంది తమను నిత్యం వేధిస్తున్నారని మొరపెట్టుకున్నారు.
తాడ్వాయి, కొండపర్తి, గంగారం, కాటాపురం గ్రామాలకు చెందిన గీతాకార్మికులు సైతం తాడ్వాయికి వచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో గీతాకార్మికసంఘం డివిజన్ అధ్యక్షుడు పులి నర్సయ్య, సీపీఎం మండల కార్యదర్శి గందేటి జైహింద్రెడ్డి, మండల నాయకులు చింతల రఘుపతి, కొమురయ్య, బెల్లంకొండ రాజు తదితరులు పాల్గొన్నారు.