షాకింగ్: గుండె కింద బద్దె పురుగులు.. పెంపుడు కుక్కలతో జాగ్రత్త!
పెంపుడు జంతువుల ద్వారా తినే ఆహారం కలుషితమైనప్పుడు మనిషి శరీరంలోను బద్దె పురుగులు(టేప్ వార్మ్స్) వ్యాప్తి చెందే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు.
హైదరాబాద్: పెంపుడు కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని కిమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి ద్వారా తినే ఆహారం కలుషితమైనప్పుడు మనిషి శరీరంలోను బద్దె పురుగులు(టేప్ వార్మ్స్) వ్యాప్తి చెందే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు.
తాజాగా తీవ్ర అస్వస్థతతో కిమ్స్ ఆసుపత్రిని ఆశ్రయించిన ఓ పేషెంట్ శరీరంలో బద్దె పురుగులను డాక్టర్లు గుర్తించారు. పేషెంట్ గుండె కింద బద్దె పురుగులను చూసి డాక్టర్లే విస్మయం చెందారు. శస్త్ర చికిత్స ద్వారా గుండె నుంచి వాటిని తొలగించి అతని ప్రాణాలు కాపాడారు.
కిమ్స్ కార్డియోథోరాసిక్ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ కె.వి.కృష్ణకుమార్ సోమవారం నాడు ఈ వివరాలు వెల్లడించారు. దీనిని హైడాటిడ్ డిసీజ్గా పిలుస్తారని చెప్పారు. సాధారణంగా కుక్కలు ఇతర పెంపుడు జంతువుల పొట్టలోని పేగుల్లో ఈ బద్దె పురుగులు ఉంటాయని, వాటిని దగ్గరకు తీసుకున్నప్పుడు.. వాటి ద్వారా తినే ఆహారం కలుషితమైనప్పుడు ఇవి మనిషి శరీరంలోకి చేరుతాయని అన్నారు.
మనిషి శరిరీంలో ఎక్కువగా ఊపిరితిత్తుల ప్రాంతంలోనే ఈ బద్దె పురుగులు నివాస స్థావరాలను ఏర్పరుచుకుంటాయని, కానీ తమ వద్దకు వచ్చిన పేషెంట్ కు గుండె కింది బాగంలో వీటిని గుర్తించామని తెలిపారు. గుండె కింద భాగంలో వీటిని గుర్తించడం అరుదైన విషయమని అన్నారు.