టెక్కీ గర్ల్ను వీడియో తీశాడు, పట్టుబడ్డాడిలా (ఫోటో)
హైదరాబాద్: ఓ చేత్తో కారు నడుపుతునే మరో చేత్తో నిద్రమత్తులో ఉన్న యువతిని వీడియో తీసిన క్యాబ్ డ్రైవర్ను షీ బృందం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏడెనిమిది నిమిషాల పాటు వీడియో తీయడమే కాకుండా నాలుగైదు ఫోటోలను కూడా అతను తీశాడు. నిందితుడి అబ్దుల్ రషీద్ పైన పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
మాదాపూర్ సైబర్ టవర్స్ సమీపంలోని ఓ సాఫ్టువేర్ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగిని (30) రోజులాగే సంస్థకు చెందిన క్యాబ్లో ఉదయం 11.30 గంటలకు ఇంటికి బయలుదేరారు. కారులో ఎక్కిన ఆమె డ్రైవర్ సీటు పక్కనే కూర్చొని కొంతసేపటికి నిద్రమత్తులోకి జారుకున్నారు. ఆ సమయంలో డ్రైవర్ ఆమెను వీడియో తీయడం ప్రారంభించాడు.
క్యాబ్ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటి కూడలికి చేరుకోగానే షీ బృందం... క్యాబ్ డ్రైవర్ నిర్వాకాన్ని గమనించారు. వారు అతనిని దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వెంబడించారు. దీంతో విషయం తెలిసింది. క్యాబ్ను ఆపి.. డ్రైవర్ వద్ద గల సెల్ ఫోన్ను తనిఖీ చేయగా.. ఏడు నిమిషాల వీడియో లభ్యమైంది. నాలుగైదు ఫోటోలు కూడా లభ్యమయ్యాయి. అతనిని టోలీచౌకికి చెందిన అబ్దుల్ రషీద్గా గుర్తించారు. రషీద్ పైన నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
దీనిపై మల్కాజిగిరి డీసీపీ, షీ టీమ్ హెడ్ మాట్లాడుతూ... క్యాబ్ మెల్లిగా వెళ్తుండటాన్ని షీ టీమ్ పోలీసులు గమనించారని చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన వారు దానిని అనుసరించి, డ్రైవర్ నిర్వాకాన్ని గుర్తించారని చెప్పారు. అతని ఫోన్లో వీడియోను, ఫోటోలను గుర్తించారని చెప్పారు. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఏడు నిమిషాల నిడివిగల వీడియో తీశాడన్నారు.
కాగా, షీ టీమ్ సభ్యులు గుర్తించకపోయి ఉంటే నిందితుడు ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేయడం వంటి దుర్మార్గానికి కూడా పాల్పడే అవకాశాలు ఉండేవంటున్నారు.