తలసానికి కౌంటర్, 'చినజీయర్ చెప్పాకే కేసీఆర్ వాస్తు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఓడించేందుకు తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్త చాలు అని తెలంగాణ టీడీపీ నేత రాజారామ్ యాదవ్ మంగళవారం అన్నారు. మంత్రిపదవి కోసం కేసీఆర్ పంచన చేరిన తలసానిని ఓడించడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవసరం లేదని, టీడీపీ కార్యకర్త ఏవరైనా చాలన్నారు.
తొండ ముదిరి ఊసరవెల్లిగా మారినట్లు ఆలుగడ్డ శ్రీను... తలసాని శ్రీనివాస్ యాదవ్గా మారారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్కు ప్రాణం, పదవులపై భయం పట్టుకుందన్నారు.
ఇప్పుడున్న సచివాలయంలో ఉంటే కేసీఆర్కు ప్రాణగండం, పదవీ గండం ఉందని చినజీయర్ స్వామి సూచన మేరకు వాస్తుదోషం పేరుతో, సచివాలయాన్ని కేసీఆర్ మార్చాలనుకుంటున్నారని ఆరోపించారు. కాగా, దమ్ముంటే తన పైన చంద్రబాబు పోటీ చేయాలని ఇటీవల తలసాని సవాల్ చేశారు. దీనిపై రాజారామ్ స్పందించారు.
18 నుంచి నల్గొండలో షర్మిల మలి పరామర్శ
ఈ నెల 18 నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల నల్గొండ జిల్లాలో మలి పరామర్శ యాత్రను చేపట్టనున్నారు. 18 నుంచి 22 వరకూ 509 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది.
ఈసారి యాత్రలో భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నల్లగొండ, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 17 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. ఈ యాత్రలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నేతలు పాల్గొంటారు. ఆ తర్వాత ఎక్కడ పరామర్శ యాత్ర చేసేదీ స్పష్టత లేనప్పటికీ, హైదరాబాద్లో ఉండే అవకాశం ఉందంటున్నారు.