మేం బరిలో ఉంటే గట్టి పోటీ ఉండేది: ఎర్రబెల్లి, పతనం జిహెచ్ఎంసితోనన్న కిషన్
హైదరాబాద్/వరంగల్: రాష్ట్రంలో అధికార టిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమని, అయితే ఈ వ్యతిరేకతను ఉపయోగించుకోలేకపోయామని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాలు వెలువడ్డ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బరిలో ఉంటే గట్టి పోటీ ఇవ్వగలిగేవాళ్లమని చెప్పారు. అలాగే పార్టీ అభ్యర్ధిని ముందే ప్రకటిస్తే బాగుండేదన్నారు. ఇక మున్ముందు జరిగే ఎన్నికల్లో పార్టీల మధ్య పొత్తుల విషయం పార్టీ నిర్ణయిస్తుందన్నారు.
జిహెచ్ఎంసి ఎన్నికలతో టిఆర్ఎస్ పతనం: కిషన్రెడ్డి
వరంగల్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొదుపు సంఘాల ద్వారా ఓటర్లకు డబ్బులు వెదజల్లారన్నారు.
వరంగల్ ఉప ఎన్నికలో ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకో లేకపోయామని ఆయన తెలిపారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు నిరాశ కలిగించాయన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచే టీఆర్ఎస్ పతనం ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు.
మజ్లిస్ అభ్యర్థిని మేయర్ చేసేందుకు టిఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇది ఇలా ఉండగా, టిఆర్ఎస్ ప్రభుత్వం ఈవిఎంల టాంపరింగ్కు పాల్పడిందని వామపక్ష అభ్యర్థి గాలి వినోద్ కుమార్ ఆరోపించారు.
కాగా, వరంగల్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ నాలుగున్నర లక్షల ఓట్లపైగా భారీ ఆధిక్యంతో గెలుపొందగా, ఈ ఎన్నికల్లో బిజెపి- టిడిపి మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.