కాల్చి చంపేస్తారా, సంస్థ అంబాసిడర్లా: కేసీఆర్పై ఫైర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు డీకే అరుణ, జీవన్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్ని ఆధారాలతో మాట్లాడాలంటే ఎలా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఆపరేషన్ బ్లూస్టార్ అంటే ఏమిటని ప్రశ్నించారు.
హైదరాబాదులో భారీగా ఇసుక అక్రమ రవాణా సాగుతోందని, దీని వెనుక ఎవరి హస్తం ఉందో ప్రభుత్వం చెప్పాలన్నారు. అసెంబ్లీ తెరాస కార్యాలయంలో ఉందన్నారు. సంఖ్యాబలం ఉందని ఏ నిర్ణయమైనా తీసుకుంటారా అని ప్రశ్నించారు. కేసీఆర్ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.
సభ్యుల సందేహాలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తే తప్పా అని ప్రశ్నించారు. అసెంబ్లీ తెరాస ఆఫఈసులా మారిందని డీకే అరుణ అన్నారు. స్పీకర్ తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. సభ నడుస్తున్న తీరును తాము ఖండిస్తున్నామన్నారు. సభ్యుల హక్కులను సభాపతి కాలరాస్తున్నారని, సభ అంటే నవ్వుకనే విధంగా ఉందన్నారు.
అసెంబ్లీ నిర్వహణ పైన స్పీకర్తో కాంగ్రెస్ సభ్యుల భేటీ
అసెంబ్లీ నిర్వహణ పైన సభాపతి మధుసూదనా చారి కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులతో భేటీ అయ్యారు. కాగా, ప్రతిపక్షాల పైన కేసీఆర్ ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
చంపుతారా?: సండ్ర
సభలో కేసీఆర్ మాటలు తాము విన్నప్పుడు తాము చెప్పేది కూడా ఆయన వినాలి కదా అని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సీఎం తీరు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందన్నారు. సభాపతి సభ్యుల హక్కులను కాపాడాలన్నారు. కేసీఆర్ ఓ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని, ఆ సంస్థను వెనుకేసుకొస్తున్నారన్నారు. సభలో ప్రశ్నిస్తే సభ్యులను కాల్చి చంపుతారా అని ప్రశ్నించారు. ఆపరేషన్ బ్లూస్టార్ అంటే ఎన్కౌంటరే కదా అన్నారు.