30 ఏళ్ల టెస్టు మ్యాచులు ఆడాం, టీ20లా ఆరు నెలల్లో అనుకోం: నారా లోకేష్
హైదరాబాద్: రాజకీయాల్లో మూడు దశాబ్దాల టెస్టు మ్యాచులు ఆడిన అనుభవం తమ పార్టీకి ఉందని, ట్వంటీ20 మ్యాచుల్లో మాదిరిగా ఆరు నెలల్లో అన్నీ కావాలని అనుకోబోమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారంనాడు అన్నారు.
టెస్టు మ్యాచ్లు ఆడే సామర్థ్యం తెలుగుదేశం పార్టీదని, టీ 20లో ఓడినంత మాత్రాన టెస్టులు ఆడిన అనుభవం ఎక్కడికీ పోదని లోకేశ్ వ్యాఖ్యానించారు.
అటు జగన్, ఇటు కెటిఆర్: బాబు రిస్క్ చేశారా, నారా లోకేష్ ఎదుర్కోగలరా?
తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి తమ పార్టీయే ప్రధాన ప్రత్యర్థి అని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో యువకులతో ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాదులో ఓటమికి కుంగిపోయే పరిస్థితి లేదని ఆయన చెప్పారు.
హైదరాబాద్ ప్రజలకు తెరాస ఇచ్చిన హామీల అమలుకు 40 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని, అందుకు తెరాస ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలని ఆయన అన్నారు. కాపుల విషయంలో తమ పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన చెప్పారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికలకన్నా లక్షన్నర ఓట్లు అధికంగా వచ్చాయని లోకేశ్ అన్నారు. పోలింగ్ శాతం తక్కువ నమోదైనా టిడిపికి ఏడున్నర లక్షల ఓట్లు వచ్చాయన్నారు.
పార్టీ పటిష్టత కోసమే గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేశామని ఆయన బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడూతు చెప్పారు. హామీలు అమలుచేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు న్యాయం జరిగేలా తమ పార్టీ సర్వత్రా కృషి చేస్తుందని అన్నారు. ఏపీలో టీడీపీని మరింత బలోపేతం చేస్తామని నారా లోకేష్ అన్నారు.