తెరాసలో చేరేందుకు ఎమ్మెల్యే షరతు, బాబు దైవమని
హైదరాబాద్: బీసీ జాబితా నుంచి తొలగించిన ఇరవై ఆరు కులాలను తిరిగి జాబితాలో చేరిస్తే తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతానని కూకట్పల్లి శాసన సభ్యుడు మాధవరం కృష్ణారావు చెబుతున్నారు. తెరాసలో చేరితో తాను ఓడిపోతానని తెలిసినా బీసీల కోసం తాను నిర్ణయం తీసుకున్నానన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు దైవంతో సమానమన్నారు. ఆయనను కలిసి తాజా పరిస్థితులను వివరిస్తానని తెలిపారు. కాగా, తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారనే ప్రచారం ఇటీవల సాగుతున్న విషయం తెలిసిందే.
తెలంగాణ సీఎం ఇంటి వద్ద క్రైస్తవుల ఆందోళన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాసం వద్ద క్రైస్తవులు ఆందోళనకు దిగారు. హైదరాబాదులోని బేగంపేటలోని కేసీఆర్ అధికారిక నివాసం వద్ద క్రైస్తవులు ఆందోళన చేపట్టారు. సికింద్రాబాదులోని చర్చి ప్రహరీ గోడ తొలగింపుపై నిరసన చేపట్టారు. మెట్రో రైలు పనుల్లో భాగంగా చర్చి ప్రహరీ గోడను తొలగించారు.
త్వరలో శివార్లకు మెట్రోరైలు
హైదరాబాదులో నిత్యం రద్ధీగా ఉండే ప్రాంతాలను కలుపుతూ ప్రస్తుతం ఏర్పాటవుతోన్న మెట్రోరైలు ప్రాజెక్టును శివార్లకు కూడా విస్తరించేందుకు అనుకూలంగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం వెల్లడించారు. మెట్రోరైలు, ఎల్ అండ్ టి అధికారులు కూడా వ్యాపారాలపైనే ఆధారపడి జీవిస్తున్న వారికి ఇబ్బందులు కలగకుండా మెట్రోరైలు పనులను పూర్తి చేయాలన్నారు.
ఈ మేరకు ఆయన బుధవారం అమీర్పేట ప్రాంతంలో మెట్రోరైలు నిర్మాణ పునులను పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన్ను కలిసిన పలువురు వ్యాపారులు మెట్రోరైలు పనుల కారణంగా ట్రాఫిక్ సమస్య పెరిగి, ఇబ్బందులెదుర్కొంటున్నామని, దాని వల్ల తమ వ్యాపారాలు కూడా ఆశించిన స్థాయిలో సాగటం లేదని వాపోయారు.ఇందుకు స్పందించిన తలసాని మెట్రోరైలు ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు.
దీన్ని గమనించి ప్రజలు కూడా సహకరించాలన్నారు. ఇతర నగరాల్లో జరుగుతున్న మెట్రోరైలు పనుల కన్నా మన నగరంలో జరుగుతున్న మెట్రోపనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. నగరంలో 72 కిలోమీటర్ల మేరకు మెట్రోరైలు అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గటంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుముఖం పడుతాయన్నారు.
మెట్రోరైలు నిర్మాణ దశలో ఉన్నందున ప్రజలకు కొంత ఇబ్బందలు కలుగుతుండటం వాస్తవమేనని, పూర్తైన తర్వాత ప్రజలకు ఆధునిక రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు. అమీర్పేటలో కొందరు వ్యాపారస్తులు మంత్రిని కలిసి మెట్రో కారణంగా తాము వ్యాపార సంస్థలను కోల్పోవల్సిన వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో మూడు, నాలుగు రోజుల్లో సమావేశమై చర్చించనున్నట్లు తెలిపారు. వ్యాపార సంస్థలను కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం చూపించే దిశగా కృషి చేస్తామన్నారు.