బాబుకు మరో షాక్: తెరాసలోకి ఎమ్మెల్యే మంచిరెడ్డి?
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే తలసాని శ్రీనివాస యాదవ్, తీగెల కృష్ణా రెడ్డి వంటి శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరగా తాజాగా మరో శాసనసభ్యుడు గోడ దూకేందుకు సిద్ధపడ్డారు.
రంగా రెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి టిఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నట్లు చర్చ సాగుతోంది. ఇందుకు గాను, పార్టీ కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమావేశమయ్యారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు, అభిమానులు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమతిలో చేరే అలోచనను కిషన్రెడ్డి కార్యకర్తల ముందు ఉంచినట్లు సమాచారం. సోమవారంనాడే ఆయన టిఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన సోమవారంనాడు తన సన్నిహితులు, ముగ్గురు జడ్పీటిసీలు, మరికొందరు సర్పంచులతో సమావేశమై ఆ విషయం చర్చించారు.
టిఆర్ఎస్లో చేరాలని తనపై తీవ్రమైన ఒత్తిడి వస్తోందని, క్షేత్రస్థాయిలో ఒక్క పని కూడా జరగడం లేదని మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నట్లు సమాచారం. అందుకే తాను టిఆర్ఎస్లో చేరే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు ఆయన అన్నారు.
మంచిరెడ్డి కిషన్ రెడ్డిని పార్టీలోకి తెచ్చే విషయాన్ని టిఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు అప్పగించినట్లు తెలుస్తోంది. మరో శాసనసభ్యుడు కూడా టిఆర్ఎస్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఎమ్మెల్యే సోమవారంనాడు కిషన్ రెడ్డిని కలిశారు.
కాగా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గులాబీ రంగుతో కూడిన పోస్టర్లు వెలిశాయి. ఎమ్మెల్యే ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని కార్యకర్తలు అంటున్నట్లు ఆ పోస్టర్లు వెలిశాయి.