టిటిడి రేస్లో వీరే, రేవంత్ చెప్తే చూద్దామని బాబు, 'అగస్టాలో జగన్ సన్నిహితుల'పై చర్చ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో మంగళవారం నాడు ఆసక్తికర చర్చ సాగింది. విభజన హామీలు, తెలంగాణలో ఎవరికి పదవులు ఇవ్వాలి, తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. వీటితో పాటు దేశాన్ని కుదిపేస్తున్న అగస్టా కుంభకోణంలో జగన్ సన్నిహితుల పాత్ర పైన చర్చ జరిగిందని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కంటోన్మెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన సాయన్న ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన తెరాసలో చేరారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
టిటిడి బోర్డు రేసులో అరికెల, శోభారాణి
చదలవాడ కృష్ణమూర్తి సహా 19 సభ్యుల్లో ఒక్క సాయన్న మినహా మిగిలిన వారందరినీ బోర్డులో కొనసాగించారు. తెరాసలో చేరిన సాయన్నకు మాత్రం నో చెప్పారు. దీంతో పదవీ కాలం పొడిగింపు సాయన్నకు దక్కలేదు. సాయన్న స్థానంలో ఎవరిని నియమించాలనే చర్చ తెలంగాణ టిడిపిలో సాగుతోంది.
పొలిట్ బ్యూరోలో ఆ అంశం చర్చకు వచ్చింది. తెలంగాణ టిడిపి మహిళా నేత శోభారాణికి ఆ పదవి ఇవ్వాలని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సూచించారు. చాలా ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న అరికెల నర్సిరెడ్డి లాంటి వారికి న్యాయం జరగాల్సి ఉందని, దీనిపై తర్వాత ఆలోచిద్దామన్నారు. ఇప్పుడు టిటిడి సభ్యుడి రేసులో శోభారాణి, అరికెల ఉన్నారు.
జగన్ పార్టీ నేతలకు తెలంగాణలో ప్రాజెక్టులు: రమణ
తెలంగాణలో వైసిపి అధినేత జగన్ సన్నిహితులకు, ఆయన పార్టీ వారికి ప్రాజెక్టులు కట్టబెడుతున్నారని ఎల్ రమణ చెప్పారు.
ఏపీపిఎస్సీ బోర్డులో తెలంగాణ విద్యావంతులకు ఛాన్సివ్వాలని రేవంత్
ఏపీపీఎస్సీ బోర్డులో తెలంగాణ విద్యావంతులకు అవకాశమివ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు. దానికి చంద్రబాబు ఆలోచిద్దామని చెప్పారు. రేవంత్ ఇంకా మాట్లాడుతూ... జగన్ సన్నిహితులకు కాంట్రాక్టులు ఇస్తున్నారని చెప్పారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెరాసలో చేరడాన్ని జగన్ పాజిటివ్గా తీసుకున్నారని చెప్పారు. అదే సమయంలో అగస్టా కుంభకోణంలో జగన్ సన్నిహితుల పాత్ర పైన పొలిట్ బ్యూరోలో చర్చ జరిగింది.