చెప్పుతో టీడీపీ నిరసన, గులాబీ కండువాతో మంచిరెడ్డి
హైదరాబాద్: గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ పైన గెలిచి అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన ఎమ్మెల్యేల నివాసాల ముందు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం ఉదయం ఆందోళనకు దిగారు. చీపురు, డప్పులు, చెప్పుళ్లతో వారు నిరసన తెలిపారు.
సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, వరంగల్ జిల్లా ఎమ్మెల్యే ధర్మా రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డిల ఇళ్ల వద్ద టీడీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. తలసాని ఇంటి వద్ద టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
తెలుగు యువత అధ్యక్షుడు వీరేంద్ర గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సరూర్నగర్ వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇళ్ల ఎదుట ఆందోళనలకు టీటీడీపీ పిలుపు నిచ్చిన నేపథ్యంలో వీరేంద్ర గౌడ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గులాబీమయమైన హైదరాబాద్
శుక్రవారం నాడు తెలంగాణ ప్లీనరీ నేపథ్యంలో హైదరాబాద్ గులాబీమయమైంది. ప్లీనరీలో తెలంగాణ వంటకాలు రుచి చూపించనున్నారు. ఈ సమావేశానికి తెరాసలో చేరుతానని చెప్పిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గులాబీ కండువాతో హాజరయ్యారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఏకైక కారణంతోనే తాను తెరాసలో చేరానని ఈ సందర్భంగా మంచిరెడ్డి అన్నారు. టీడీపీలో 30 సంవత్సరాలు సేవ చేశానని అదే విధంగా పార్టీ కూడా తనను గుర్తించదన్నారు. అయితే తన నియోజకవర్గాన్ని ఈ నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి చేయని పక్షంలో ఏం చెప్పాలన్నారు. అందుకే పార్టీ మారానన్నారు. భవిష్యత్లో ఎప్పుడూ టీడీపీని విమర్శించనన్నారు.