చక్రం తిప్పుతున్న హరీష్, ఎర్రబెల్లిని సస్పెండ్ చేసిన బాబు, ఆ స్థానంలో రేవంత్
హైదరాబాద్: ఇప్పటి వరకు తెలంగాణ తెలుగుదేశం పార్టీలోని తొమ్మిది మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా, ఎర్రబెల్లి దయాకర రావు, ప్రకాశ్ గౌడ్లు కారు ఎక్కారు. వీరి చేరికలో మంత్రి హరీష్ రావు కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది.
మంత్రి హరీశ్ రావుతో ఎర్రబెల్లి చర్చల తర్వాత టిఆర్ఎస్లో ఆయన చేరిక ఖరారైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నారాయణఖేడ్ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొన్నారు. మంత్రి హరీశ్ రావు కూడా సీఎంతో పాటు హైదరాబాద్ వచ్చారు.
అనంతరం హరీశ్.. ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్లతో సమావేశమయ్యారు. అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వచ్చి తెరాసలో చేరడం చకచకా జరిగిపోయాయి. మరికొంతమంది ఎమ్మెల్యేల చేరికకూ హరీష్ చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. మరోవైపు, మరికొందరు తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు అదే బాటలో ఉన్నారని అంటున్నారు.
ప్రస్తుతం తెలంగాణ టిడిపి శాసనస భ్యుల్లో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్ కృష్ణయ్య, మాగంటి గోపీనాథ్, రాజేందర్ రెడ్డి, గాంధీ పార్టీ తరఫున మిగిలి ఉన్నారు. వీరిలోనూ కొందరు కారు ఎక్కుతారనే ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, గోపీనాథ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్నారు.
సండ్ర వెంకటవీరయ్యను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశాక ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్లు మాట్లాడుతూ తమబాటలో త్వరలోనే మరికొందరు తెరాసలోకి వస్తారని ప్రకటించటం గమనార్హం.
టిడిపి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర రావు, ప్రకాష్ గౌడ్, వివేకానంద గౌడ్లను టిడిపి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి దీన్ని విడుదల చేశారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో టీడీఎల్పీ నేతగా ఉన్న ఎర్రబెల్లి పార్టీకి హ్యాండిచ్చిన నేపథ్యంలో టీ టీడీఎల్పీ ఉపనేతగా ఉన్న రేవంత్ రెడ్డిని ఆ పదవిలో నియమించాలని కూడా చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాశారు. ఎర్రబెల్లి తదితరులను పార్టీ నుంచి బహిష్కరించిన విషయాన్ని కూడా చంద్రబాబు ఆ లేఖలో ప్రస్తావించారు.
కాగా, ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకేసారి జంప్ అయిన నేపథ్యంలో.. గురువారం మధ్యాహ్నం చంద్రబాబు హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఎర్రబెల్లి, ప్రకాశ్, వివేక్ల రాజీనామా తర్వాత పార్టీ పరిస్థితి, భవిష్యత్తుపై ఈ భేటీలో కీలక చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది.