మూడు ఎంపీటీసీలు కైవసం: తెలంగాణలో టీడీపీ పుంజుకుంటుందా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో నిర్వహించిన రెండు ఎంపీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గమైన కొడంగల్లో టీడీపీ హవా కొనసాగింది.
మద్దూరు మండలం బూనీడు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి నరేందర్రెడ్డిపై టీడీపీ అభ్యర్థి విజయలక్ష్మీ 692 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఇక్కడ మూడు నెలల క్రితం టీడీపీ ఎంపీటీసీ పద్మ అనారోగ్యంతో చనిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది.
ఇక ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయపల్లి ఎంపీటీసీ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్ధి మట్కు 166 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం ఎంపీటీసీకి జరిగిన ఉప ఎన్నికల్లో 75 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి రాజు విజయం సాధించారు.
ఇక్కడ కాంగ్రెస్ ఎంపీటీసీ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించటంతో ఆ పార్టీ వర్గాల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. తాజా ఫలితాలను చూస్తుంటే తెలంగాణలో టీడీపీ క్రమంగా పుంజుకునేలా కనిపిస్తోంది.