కొత్త మోసాలకు తెరతీసిన గూగుల్ మాజీ టెక్కీ: పట్టేశారిలా(పిక్చర్స్)
అతడు అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్ సంస్థలో పనిచేశాడు. డిజిటల్ మార్కెటింగ్పై పట్టు సాధించాడు. ఆ తర్వాత ఎందుకో ఉద్యోగం మానేశాడు.
హైదరాబాద్: అతడు అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్ సంస్థలో పనిచేశాడు. డిజిటల్ మార్కెటింగ్పై పట్టు సాధించాడు. ఆ తర్వాత ఎందుకో ఉద్యోగం మానేశాడు. కానీ, డబ్బులు అవసరం పడటంతో తన ఉద్యోగ అనుభవాన్ని అవకాశంగా చేసుకుని కొత్త తరహా మోసాలకు తెరతీశాడు. చివరకు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారు అతడి ఆట కట్టించారు. గూగుల్ యాడ్స్ పేరుతో వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్న గూగుల్ మాజీ ఉద్యోగితోపాటు మరో వ్యక్తిని సిటీ సైబర్క్రైం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
గూగుల్ ఉద్యోగి నుంచి మోసగాడిగా..
శ్రీకాకుళం జిల్లా హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన కల్లేపల్లి బాలగంగాధర్(29) గూగుల్ కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్లో పనిచేశాడు. కొద్దికాలం తరువాత ఉద్యోగం మానేసి బయటకు వచ్చాడు. ఆర్థిక ఇబ్బందులు మొదలవటంతో తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. పూర్వ అనుభవంతో మార్కెటింగ్ను ప్రారంభించాడు. గూగుల్ ఉద్యోగిగా పరిచయం చేసుకుని మోసాలకు తెగబడ్డాడు. దీనికి అదే జిల్లాకు చెందిన భానూజీరావు(21)ను సహాయకుడిగా ఏర్పాటుచేసుకున్నాడు. గూగుల్లో ప్రకటనలిచ్చేందుకు ఆసక్తి ఉన్న ఖాతాదారుల ఫోన్ నెంబర్లు, చిరునామాలు సేకరించటం అతడి బాధ్యత. ‘యాడ్ వర్డ్స్ రాక్స్టార్' పేరుతో ఫ్రీలాన్సర్గా అవతారమెత్తాడు.
ఆట కట్టించిన పోలీసులు..
ప్రకటనలు స్వీకరిస్తూ ఖాతాదారుల నుంచి రూ.20,000-1,00,000 వరకూ వసూలుచేశారు. ఆ డబ్బును భానుజీరావు బ్యాంకు ఖాతాలో జమచేసేవారు. ఇప్పటి వరకూ చాలామందిని మోసగించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నారాయణగూడకు చెందిన డిజిటిల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ ఎ. రాధాకృష్ణ మోసగాళ్ల బారినపడి లక్షల రూపాయలను వారి ఖాతాల్లో జమచేశాడు. మోస పోయినట్టు గ్రహించిన బాధితుడు మే 26న సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ రఘువీర్ పర్యవేక్షణలో ఇనస్పెక్టర్ జి.శంకర్రాజు, ఎస్ఐలు బి.లచ్చిరెడ్డి, రమేష్, హెడ్కానిస్టేబుల్ కె.ఠాకూర్, కానిస్టేబుల్స్ సునీల్, క్యుమర్, చంద్రశేఖర్ మాయగాళ్ల బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులు బాలగంగాధర్, భానుజీరావును అరెస్టు చేసి వారి నుంచి రెండు మొబైల్ ఫోన్లు, మూడు డెబిట్కార్డులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాల్లోని రూ.3,66,990ను ఫ్రీజ్ చేశామని సీసీఎస్ డీసీపీ అవినాష్మహంతి తెలిపారు.
విద్యార్థులే టార్గెట్.. మత్తుమందు కేసులో ముగ్గురు
ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సకు ముందు ఇచ్చే మత్తుమందును యువతకు అలవాటు చేస్తూ అక్రమంగా విక్రయిస్తున్న కడప జిల్లాకు చెందిన ముగ్గురిని ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 450 గ్రాముల మత్తు ఔషధాన్ని స్వాధీనం చేసుకుని అప్జల్గంజ్ పోలీసులకు అప్పగించారు. టాస్క్ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, ఈస్ట్జోన్ ఇన్స్పెక్టర్ మోహన్కుమార్ గురువారం తమ కార్యాలయంలో వెల్లడించారు. కడప జిల్లా వికలాంగుల కాలనీ, సెంటల్ జైల్, చిన్న చౌక్ పోస్టు ప్రాంతానికి చెందిన దుగ్గసని నాగేశ్వరరెడ్డి(40) కూలీగా పనిచేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన పతన్ నజీర్ఖాన్(32) ప్రైవేట్ ఉద్యోగి. కడపజిల్లా దేవుని కడప సన్నిధి స్ట్రీట్ ప్రాంతానికి చెందిన ఆకుల గోపినాథ్(25) కొబ్బరి కాయల వ్యాపారి. ముగ్గురు కలిసి అఫ్జల్గంజ్కు వచ్చి లాడ్జీలో గదిని అద్దెకు తీసుకుని నగరంలోని యువతకు, డ్రగ్స్ అలవాటు ఉన్నవారికి మత్తు ఔషధాన్ని అమ్మేందుకు యత్నిస్తున్నారు. గురువారం ఉదయం లాడ్జీల్లో తనిఖీలు చేసిన పోలీసులు వారిని పట్టుకున్నారు. నాలుగు నెలల క్రితం కడప జిల్లా కమలాపురానికి చెందిన వెంకటేశ్ వద్ద ఈ డ్రగ్స్ను కొనుగోలు చేసినట్లు నిందితులు అంగీకరించారు. పరారీలో ఉన్న వెంకటేశ్ను అదుపులోకి తీసుకుంటే ఎక్కడినుంచి వచ్చిందనే విషయం తెలుస్తుందని తెలిపారు.
విదేశీ నోట్లంటూ లక్ష కాజేశారు.. చివరికి..
విదేశీ నోట్లు తమ వద్ద ఉన్నాయని అమాయకులను నిలువు దోపిడీ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అఫ్జల్గంజ్ పోలీసుస్టేషన్లో మీడియా సమావేశంలో అఫ్జల్గంజ్ ఇన్స్పెక్టరు జ్ఞానేందర్రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టరు ప్రవీన్కుమార్, ఎస్సైలు నాగరాజు, కరుణాకుమార్లు వివరాలు వెల్లడించారు. పశ్చిమ్ బంగ ప్రాంతానికి చెందిన నజ్మా బేగం(37) కొన్నేళ్ల క్రితం ఓల్డ్ అల్వాల్ ప్రాంతానికి వలస వచ్చారు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఎండి. ఇబ్రహీం, పశ్చిమ బెంగాల్కు చెందిన షగ్గూర్, అల్గింలతో పాటు మరో వ్యక్తి ఐదుగురితో ముఠాగా ఏర్పడ్డారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో పథకం ప్రకారం నజ్మా బేగం ఓల్డ్ అల్వాల్లోని నజీర్ అనే వ్యక్తి పాన్ డబ్బా వద్ద తరచూ పాన్లు కొనుగోలు చేస్తూ పరిచయం పెంచుకుంది. ఈ నేపథ్యంలో తనకు రూ.రెండు లక్షలు అప్పుగా ఇవ్వాలని నజ్మా కోరారు. తన వద్ద అమెరికాతో పాటు విదేశాలకు చెందిన విలువైన కరెన్సీ నోట్లు ఉన్నాయని, వాటిని మార్పిడి చేయించగా వచ్చిన డబ్బులతో బాకీ తీర్చేస్తానంటూ నమ్మించారు. ఇది నిజమేనని నమ్మిన నజీర్ నజ్మాకు రూ.50 వేలు అప్పుగా ఇచ్చారు. దీంతో నజ్మా తన వద్ద ఉన్న అమెరికాకు చెందిన డాలర్లను చూపించారు. పైన పేర్కొన్న ఐదుగురితో పాటు పాన్ షాపు నిర్వాహకులు నజీర్ వాటిని పాతబస్తీలో మార్పిడి చేయించేందుకు ఆటోలో అఫ్జల్గంజ్ ఉస్మాన్షాహికి వచ్చారు. ఆటో దిగిన తర్వాత రెప్పపాటులో ఆమెతో పాటు వచ్చిన ఐదుగురు వ్యక్తులు పారిపోయారు. తాను మోసపోయానని గ్రహించిన నజీర్ అఫ్జల్గంజ్ పోలీసులను ఆశ్రయించారు. ఉస్మాన్షాహి, అఫ్జల్గంజ్ పరిసర ప్రాంతాల్లో అమర్చిన సిసి కెమెరా పుటేజీలను పరిశీలించిన పోలీసులు ఆటో నెంబరు ఆధారంగా నిందితులను అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి రూ.1.4. లక్షల నగదు, పది సెల్ఫోన్లు, పది సిమ్కార్డులను స్వాధీనం చేసుకున్నారు.