టెక్కీ ఇంట్లో చోరీ: హత్య కేసులో అరెస్టులు
హైదరాబాద్: ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఊరు వెళ్లొచ్చేసరికి ఇంట్లో దొంగలు చొరబడి ఐదు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పద్మానగర్ ఫేజ్-2లోని సాయిబాలాజీ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్న జగదీష్ మూడు రోజుల క్రితం కుటుంబంతో కలిసి ఇంటికి తాళం వేసి వరంగల్ వెళ్లాడు. సోమవారం రాత్రి దొంగలు ప్లాట్ తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలోని బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
మంగళవారం ఉదయం జగదీష్ ప్లాట్ తాళం పగలగొట్టి ఉండటం గమనించిన వాచ్మన్ పేట్బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ కోటేశ్వర్రావు వివరాలు సేకరించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
హత్య కేసులో ఇద్దరు అరెస్టు
ఈ నెల 10న జరిగిన ప్రింటింగ్ ప్రెస్ యజమాని జావిద్ హత్య కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఓ స్కార్పియో వాహనం, ఓ పాస్పోర్టు, ఏడు బిట్స్ నోట్బుక్లు, రెండు సెల్ఫోన్లు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తన కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 10న ఉదయం 9:30 గంటలకు చత్తాబజార్లో మహ్మద్ జావిద్ను ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేయగా జావిద్ చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.
దీనిపై మీర్చౌక్ పోలీసులు కేసు నమోదు చేయగా చత్తాబజార్లోని షాహిన్ ప్రింటింగ్ ప్రెస్ యజమాని హసన్ బిన్ ఇబ్రహీం అల్జాబ్రీ(31)ను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. అతడి వద్ద జావిద్ చిట్టీ వేయగా నాలుగు నెలలుగా నెలకు రూ.ఆరు వేల చొప్పున ఇవ్వడం లేదని చెప్పాడన్నారు. 10న షాపు తెరుస్తుండగా ఇబ్రహీం స్నేహితుడు మహ్మద్ అలితోపాటు జావిద్ వద్దకు వెళ్లి డబ్బు చెల్లించాలని అడగ్గా వాగ్వివాదం జరిగిందని, దీంతో తమతో ఉన్న కత్తులతో దాడిచేసి పరారయ్యామని ఒప్పుకున్నాడని తెలిపారు.
వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ బాబురావు, మీర్చౌక్ ఏసీపీ గంగాధర్, మీర్చౌక్ ఇన్స్పెక్టర్ యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.