ఎత్తు పెరగడానికి కాళ్లు నరికి ఆపరేషన్: టెక్కీ నిఖిల్ నడుస్తున్నాడు
ఎత్తు పెరగడానికి కాళ్లు నరికి శస్త్రచికిత్సకు గురైన టెక్కీ నిఖిల్ రెడ్డి సొంతంగా అడుగులు వేయగలుగుతున్నాడు. దాదాపు ఎనిమిది నెలల పాటు మంచానికే పరిమితమైన అతను ఇప్పుడు కాస్తా కుదుటపడ్డాడు.
హైదరాబాద్: ఎత్తుపెరగడానికి శస్త్రచికిత్స చేయించుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిఖిల్రెడ్డి ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. దాదాపు ఎనిమిది నెలలపాటు మంచానికే పరిమితమైన నిఖిల్ ఇప్పుడు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడని చెప్పారు. రోజుకు పదిహేను అడుగుల చొప్పున అతడిని నడిపిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలావుంటే, ఆపరేషన్ చేసిన వైద్యుడిని మెడికల్ కౌన్సిల్ సస్పెండ్ చేయడంతో నిఖిల్రెడ్డికి చికిత్స ఆగిపోయింది. దీంతో నిఖిల్రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ స్థితిలో మీడియాలో వార్తలు రావడంతో తెలంగాణ సూపర్స్పెషాల్టీ హాస్పిటల్స్ అసోసియేషన్(టీఈఎ్సహెచ్ఏ) వైద్యులు స్పందించారు.
నిఖిల్రెడ్డి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్లోబల్ ఆస్పత్రికి తీసుకువచ్చి అవసరమైన మరిన్నీ పరీక్షలు చేశారు. అనంతరం నిఖిల్ రెడ్డికి చికిత్స అందించేందుకు అసోసియేషన్ ప్రత్యేక వైద్యబృందాన్ని నియమించింది. వైద్య బృందం పర్యవేక్షణలో దాదాపు నెల రోజులు గడిచాయి.
వైద్యుల సలహా మేరకు రెండు వారాలుగా నిఖిల్రెడ్డి మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నాడు. మొదట రెండు రోజులు వాకర్ సాయంతో అడుగులు వేసిన నిఖిల్ ఇప్పడు ఎలాంటి సాయం లేకుండా నడవగలుగుతున్నాడు. నెల రోజుల్లో రెండు కాళ్ల రాడ్స్ తొలగిస్తారని సమాచారం.