నోటుకు ఓటు: వాయిస్ టెస్టు, రూట్ మార్చిన ఎసిబి
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) నిందితుల వాయిస్ టెస్టుకు సిద్ధమవుతోంది. అయితే ఈ విషయంలో ఎసిబి రూట్ మార్చినట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు స్కాం కేసులో నిందితుల స్వర పరీక్ష నిమిత్తం శాంపిల్స్ సేకరించడానికి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ కసరత్తు ప్రారంభించింది.
ఆడియో, వీడియో టేపుల్లోని గొంతులను నిర్ధారించుకునేందుకు నిందితులకు నోటీసులు జారీ చేయాలని ఎసిబి తొలుత భావించింది. అయితే, అందులో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రూట్ మార్చినట్లు సమాచారం. కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు శాసనసభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యల స్వర నమూనాలను అసెంబ్లీలో వారు వివిధ సందర్భాల్లో మాట్లాడిని వీడయో రికార్డుల నుంచి తీసుకుంటారు.
అందుకు ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ను ఎసిబి అధికారులు కోర్టుద్వారా సంప్రదించినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని కలిసి ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు గతంలో అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంగా చేసిన రికార్డులను ఇవ్వాలని లిఖితపూర్వకంగా కోరనుంది.
కోర్టు ద్వారా తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని కలవాలని నిర్ణయించారు. దీని వల్ల చట్టబద్ధత ఉంటుందని ఏసిబి భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వర పరీక్షకు నిలబడే అవకాశాలు తక్కువని ఏసిబి వర్గాలు చెప్పాయి.
మత్తయ్య, సెబాస్టియన్ల స్వర నమూనాల కోసం వారు గతంలో వివిధ చానళ్లతో వేర్వేరు సందర్భాల్లో మాట్లాడిన టేపులను ఆయన చానెళ్ల నుంచి 91వ సెక్షన్ కింద సేకరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకు టీవీ చానెళ్లకు ఎసిబి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
ఈ శాంపిల్స్ను సేకరించి మొబైల్ ఫోన్లలో రికార్డయిన నిందితుల స్వరంతో పోల్చనున్నారు. ఈ శాంపిల్స్ను వెంటనే సేకరించి ఏపి ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపనున్నారు. ఈ కేసులో తప్పించుకుని తిరుగుతున్న మత్తయ్య జెరూసలేంతో ఒక చానల్ ఫోన్ ఇన్ ద్వారా ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలను కూడా సేకరించనున్నారు. ఈ స్వర పరీక్షలు, వాటి ఫలితాలు వచ్చిన తర్వాత ఈ కేసులో మరి కొంతమంది నిందితులపైన కేసులను నమోదు చేసే అవకాశం ఉందని ఏసిబి వర్గాలు తెలిపాయి.