చంద్రబాబు సంభాషణ: సెబాస్టియన్ రెండో ఫోన్ కాల్స్ ట్రాన్స్స్క్రిప్ట్ రెడీ?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడు సెబాస్టియన్కు చెందిన రెండవ ఫోన్లోని కాల్ రికార్డ్స్ సంభాషణలను ట్రాన్స్స్క్రిప్ట్ పనులను ఏసీబీ అధికారులు పూర్తి చేయించారు. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) అధికారులకు పంపించారు.
ఎఫ్ఎస్ఎల్ వీటిని నిరారించి, కోర్టుకు సమర్పించనుంది. కోర్టునుంచి ట్రాన్స్స్క్రిప్ట్ను తీసుకొని అధికారులు దర్యాప్తును మరింత ముందుకు తీసుకుపోతారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను కొనుగోలు చేసేందుకు జరిపిన ప్రయత్నంలో సెబాస్టియన్ వాడిన రెండు సెల్ఫోన్లలో ఒకదానిలో సండ్ర సంభాషణలు బయటపడ్డాయి.
రెండవ సెల్ఫోన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన సంభాషణ ఉండటంతో ఈ ట్రాన్స్స్క్రిప్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. సెల్ఫోన్ కాల్ రికార్డుతో పోలుస్తూ ట్రాన్స్స్క్రిప్ట్ను ఎఫ్ఎస్ఎల్ అధికారులు పరీశీలించి, రెండూ ఒకేలా ఉన్నాయని నిర్థారించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కావటానికి మరో వారం పట్టవచ్చునని అధికారులు చెప్తున్నారు.
సెబాస్టియన్ రెండవ సెల్ఫోన్ ట్రాన్స్స్క్రిప్ట్ ప్రతులు ఏసీబీ అధికారుల చేతికి అందిన వెంటనే దాదాపు పది మందికి సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నోటీసులు పంపించే అవకాశం ఉందని తెలిసింది. ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా నోటీసులు వెళ్తాయని సమాచారం.