రేవంత్ రెడ్డిని వదలనంటూ ఎసిబి: బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకు
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) భావిస్తోంది. ఈ కేసులో తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు ఉదయ సింహ, సెబాస్టియన్లకు మంగళవారంనాడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ముగ్గురు నిందితులకు హైకోర్టులు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఎసిబి తరఫున న్యాయవాదులు చెప్పారు. హైకోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాత సమీక్ష జరిపి ఒకటి రెండు రోజుల్లో సుప్రీంకోర్టుకు వెళ్తామని వారు చెప్పారు.
రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ. 50 లక్షల రూపాయలతో పాటు ఇస్తానని హామీ ఇచ్చిన 4.5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం తెలియాల్సి ఉందని, నాలుగో నిందితుడు జెరూసలెం మత్తయ్యను ఇప్పటి వరకు కూడా విచారించలేదని, నోటీసులు జారీ చేసిన వ్యక్తులు తమకు ముందు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారని, ఈ నేపథ్యంలో ఎవరికీ బెయిల్ ఇవ్వవద్దని వారు హైకోర్టులో వాదించారు.
హైకోర్టులో ఛార్జీ షీట్ దాఖలు చేయలేదని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు రాకుండానే బెయిల్ ఎలా ఇచ్చారంటూ ఎసిబి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. అడ్వొకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి వాదనలతో ఏకీభవించని హైకోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.