పట్టించుకోని కేంద్రం, కేసీఆర్-బాబు మధ్య ఆ గొడవ సమసిపోలేదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) వివాదం ముగిసిపోయేలా కనిపించడం లేదు. ఆ వివాదం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తమను ఏపీ ప్రభుత్వం కాపీ చేసిందని తెలంగాణ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఆరోపించగా, దానిని ఏపీ ఖండించింది. అయితే, ఇది మరోసారి చర్చనీయాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దీని పైన తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేసింది.
సీక్రెట్ కాపీ!: 'ఏపీ చోరీపై సమాధానం చెప్పలేకపోయిన తెలంగాణ'
తాజాగా, ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ వీడియో కాన్ఫరెన్సును అన్ని రాష్ట్రాలతో నిర్వహించనుంది.
ఈ సమయంలో ఏపీ తమ ఈవోడీబీని కాపీ చేసిందనే విషయాన్ని మరోసారి కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్రం ఇచ్చిన ప్రిలిమినరీ ర్యాంకింగుల ప్రకారం.. ప్రస్తుతం ఈవోడీబీలో తెలంగాణ ఆరో ర్యాంకులో, ఏపీ తొమ్మిదో ర్యాంకులో ఉంది.
కాగా, తమ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిసినెస్ను ఏపీ కాపీ కొట్టిందని తెలంగాణ ప్రభుత్వం జూలై తొలి వారంలోనే కేంద్రానికి రాతపూర్వక ఫిర్యాదు చేసింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు మంత్రి కేటీ రామారావు లేఖ రాశారు.
పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ కూడా ఢిల్లీలో కామర్స్ మినిస్ట్రీ అధికారులను కలిశారు. ఏపీ పైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఇప్పటి దాకా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2వరకు అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని తెలంగాణకు సమాచారం వచ్చింది. దీంతో మరోసారి ఏపీ కాపీ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది.