ఆగిన గుడి గంట: ఎక్కువవుతుందని కెసిఆర్ ప్రభుత్వానికి కోదండ హెచ్చరిక
హైదరాబాద్: అర్చకుల జెఏసి సమ్మెకు తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ బుధవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అర్చకులు సంఘటితంగా పోరాడితే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.
అర్చకుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటిస్తే అర్చకులు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చేది కాదన్నారు. అర్చకులు, ధర్మకర్తలు, సిబ్బందికి ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు.
ప్రభుత్వం వైఖరి మార్చుకోకుంటే సమ్మె ఉధృతమవుతుందని హెచ్చరించారు. కాగా, అర్చకులు మంగళవారం నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో అఱ్చకులు పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారు.
అర్చకుల ధర్నా
సమస్యల పరిష్కారం కోసం అర్చక - ఉద్యోగుల సమ్మె చేపట్టడంతో తెలంగాణలో గుడి గంట మోగలేదు. 010 పద్దుకింద ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలనే డిమాండుతో మంగళవారం నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు.
అర్చకుల ధర్నా
హైదరాబాదు సహా పది జిల్లాల్లో అర్చకులు పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఆలయాల్లో ఆర్జిత సేవలు నిలిచిపోయాయి. హైదరాబాదులోని చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అర్చకులు చేపట్టిన సమ్మెకు బిజెపి శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ మద్దతు పలికారు.
అర్చకుల ధర్నా
అర్చకులు సమ్మె చేస్తే మంచిది కాదని, వెంటనే 010 కింద ట్రెజరీ ద్వారా అర్చకులకు వేతనాలు అందించాలన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా ధర్నా చేస్తామని అర్చకులు చెబుతున్నారు.
అర్చకుల ధర్నా
ఇదిలా ఉండగా, అర్చకుల సమస్యలు పరిష్కరించామని సిఎం కెసిఆర్ మంగళవారం కరీంనగర్ జిల్లాలో చెప్పారు. పరిష్కారం కాని సమస్యలు రమణాచారి చూసుకుంటారన్నారు. మరోవైపు, ఏ రోజు ఎందరు అర్చకులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారో రోజు నివేదిక పంపాలని ఈవోలను దేవాదాయ శాఖ ఆదేశించింది.