దేశ సరిహద్దుల్లో తెలంగాణ కళాకారుడి అరెస్టు
జైసల్మేర్: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణానికి చెందిన కళాకారుడు అక్రమ్ ఫిరోజ్ (26) దేశసరిహద్దుల్లో అరెస్టయ్యాడు. సరిహద్దుల్లేని సమాజం కావాలని కోరుకునే అక్రమ్ ఫిరోజ్ ఎక్కడ సమస్య ఉన్నా అక్కడి వెళ్లి తన వంత సాయం అందిస్తూ ఉంటాడు.
ఏదో ఒక సామాజిక కార్యం మీద దేశ సంచారం చేస్తుంటాడు. ఆయితే ఆ అలవాటే ఆయనను చిక్కుల్లో పడేసింది. కోర్టు వరకు చేరిన వ్యవహారం మొత్తానికి సుఖాంతమైంది. కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణానికి చెందిన అక్రం ఫిరోజ్ (26) ఓ నాటక కళాకారుడు.
ఇండో-పాక్ సరిహద్దు గ్రామాల్లో నాటకాలు ప్రదర్శించేందుకు ఈ ఏడాది జూలై థియేటర్ ఎట్ బోర్డర్స్ పేరిట ఓ ప్రాజెక్టు సిద్ధం చేసుకున్నాడు. ఇందులోభాగంగా గుజరాత్లోని కచ్ నుంచి కోల్కతా వరకు సరిహద్దు గ్రామాల గుండా ప్రయాణించాలన్నది అతడి ఉద్దేశ్యం.
అయితే, జైసల్మేర్ పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని అతడిని ఈ నెల 13న అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి అక్రం సోదరుడు ఆలం హుటాహుటిన జైసల్మేర్ చేరుకుని, అతడిని విడిచిపెట్టాల్సిందిగా కోరారు. అయితే వారినుంచి విచిత్ర ప్రశ్నలు ఎదురయ్యాయి.
మాసిన గడ్డంతో ఉన్నాడు, కశ్మీర్తో సంబంధాలు ఏమైనా ఉన్నాయా?ఓ అధికారి ప్రశ్నించాడు. ఎట్టకేలకు రెండు వారాల తర్వాత పోలీసులు కోర్టులో హాజరుపర్చగా కోర్టు అతడిని బెయిల్పై విడిచిపెట్టింది.